ప్రస్తుతం చాలామంది బస్ టికెట్లను దాదాపు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణం చాలా సులభతరమైంది. అయితే కొన్నిసార్లు టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతాయి. ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి సంఘటనే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వినియోగదారుల కమిషన్ దీనిని విచారించి కీలక తీర్పును వెల్లడించింది.
2023 అక్టోబర్ 5న జయంత్ పాటియల్ అనే వ్యక్తి పాలంపూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెడ్బస్ ద్వారా రూ.600 చెల్లించి బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 10:15 గంటలకు బస్సు బయలుదేరాల్సి ఉండటంతో, అతడు సమయానికంటే ముందే బోర్డింగ్ పాయింట్కు వెళ్ళాడు.
బోర్డింగ్ పాయింట్ చేరుకున్న తరువాత బస్ ఆపరేటర్ అయిన భర్మణి ట్రావెల్స్ను సంప్రదించినప్పుడు, రాత్రి 10:15 గంటలకు షెడ్యూల్ ప్రకారం బస్సు ఏదీ లేదని చెప్పినట్లు జయంత్ పేర్కొన్నాడు. ఢిల్లీకి వెళ్లాల్సిన తమ చివరి బస్సు రాత్రి 8 గంటలకే వెళ్లిపోయిందని ఆపరేటర్ అతనికి తెలియజేసినట్లు వెల్లడించాడు.
దీంతో షాక్కు గురైన జయంత్ వెంటనే రెడ్బస్ కస్టమర్ కేర్ను సంప్రదించారు. సమస్యను పరిశీలిస్తామని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే రాత్రి 9:58 గంటలకు టికెట్ రద్దు చేసినట్లు, డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు సందేశం వచ్చింది. అంటే.. బస్సు బయలుదేరడానికి కేవలం 17 నిమిషాల ముందు టికెట్ను క్యాన్సిల్ చేశారు. ఇది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.
జయంత్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉండటంతో మరో మార్గం వెతకాల్సి వచ్చింది. దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించి సమీప విమానాశ్రయానికి చేరుకుని, మరుసటి రోజు ఉదయానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్లు కూడా పేర్కొన్నాడు. దీంతో ఆయనకు అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, తీవ్ర మానసిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.
ఈ ఘటనపై జయంత్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి నష్టపరిహారం కోరారు. విచారణలో రెడ్బస్ తాము కేవలం ప్రయాణికులు, బస్సు ఆపరేటర్లను కలిపే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మాత్రమేనని, బస్సు నడపడం తమ బాధ్యత కాదని వాదించింది. టికెట్ డబ్బు తిరిగి ఇచ్చామని తెలిపింది.
అయితే కమిషన్ ఈ వాదనను అంగీకరించలేదు. ఒకసారి టికెట్ బుక్ చేసి, డబ్బు తీసుకుని, బుకింగ్ను కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ అందకపోతే బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. మరోవైపు భర్మణి ట్రావెల్స్ కూడా బస్సు ఎందుకు నడపలేదనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది.
కమిషన్ రెడ్బస్, భర్మణి ట్రావెల్స్ రెండింటినీ బాధ్యులుగా నిర్ధారించింది. ప్రయాణికుడికి మానసిక వేదన, ఇబ్బందులకు రూ.5,000, కేసు ఖర్చులకు మరో రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. 30 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఇదీ చదవండి: రేషన్ కార్డులో కీలక మార్పులు!


