ఫరీదాబాద్లో నీట్ (NEET) పరీక్ష ఫలితాల ఆందోళనతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. 18 ఏళ్ల నీట్ అభ్యర్థిని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఆన్సర్ కీ ఆధారంగా తన మార్కులను అంచనా వేసుకుంది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష (NEET-UG) లో తాను ఆశించిన స్థాయి కంటే మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై, 16వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల ప్రకారం, మరణించిన విద్యార్థినిని ధన్వితగా గుర్తించారు. ఫరీదాబాద్, సెక్టార్ 87లోని రాయల్ హిల్స్ సొసైటీలో దాన్విత తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో తాను నివసిస్తున్న టవర్ A1 నుంచి పక్కనే ఉన్న టవర్ A2 పైకప్పు (Roof) పైకి వెళ్లి అక్కడ నుండి కిందకు దూకేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
తన అంచనాల కంటే చాలా తక్కువగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. భవనం పైనుండి దూకడానికి ముందు చెప్పులు విప్పి, మొబైల్ ఫోన్, చేతి బ్రాస్లెట్ , కళ్లజోడును అక్కడున్న గోడపై భద్రంగా ఉంచి ఈ నిర్ణయం తీసుకుందని సొసైటీ నివాసితులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే!
కాగా ధన్విత కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందినది. వీరు కొంతకాలంగా ఈ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విద్యార్థి తల్లి విజయవాడలో ఉండగా, ఆమె తండ్రి కోటేశ్వర్, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్ విరాళాల గోల్మాల్ గుట్టు


