ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్ సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నేతలు తరచూ సమన్వయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీశాయి.
“అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం నాలుగు అడుగులు వెనక్కి వేశాం.. స్థానిక ఎన్నికల్లో అదే ఫార్ములా ఉండదు. పార్టీ బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం” అంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ వ్యూహామా? అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాయకత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాలుగు అడుగులు వెనక్కి వేశామని.. అదే విధానాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని భావిస్తే పొరపాటని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
అసెంబ్లీ ఫార్ములా.. స్థానిక ఎన్నికల్లో వద్దు!
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పే ప్రధాన లక్ష్యంగా జనసేన సీట్ల విషయంలో భారీ రాజీకి వెళ్లింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక అవకాశమని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జనసేన చూస్తోంది. అందుకే బలమైన ప్రాంతాల్లో పోటీకి సిద్ధం కావాలనే సంకేతాలను నేతలు ఇస్తున్నారు.
పవన్ వ్యూహానికి భిన్నమా?
మరోవైపు.. చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ముందుకు సాగాలని.. రాబోయే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలకు తావు లేకుండా, సమన్వయంతో ముందుకు సాగాలనే వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూటమిలో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇది కూటమి నుంచి దూరమయ్యే సంకేతమా? లేదంటే పార్టీ విస్తరణలో భాగమైన వ్యూహాత్మక అడుగులా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
జనసేనలో పెరుగుతున్న ఆశలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన కేడర్లో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం రావడంతో పాటు, పార్టీకి కేటాయించిన పదవులు, బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కూడా తమకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావన జనసేనలో కనిపిస్తోంది.
టీడీపీ ఆధిపత్యంపై కేడర్లో అసంతృప్తి?
కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. తమ పార్టీకి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేడర్ను నొప్పిస్తూ.. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు.
వివాదమా.. వ్యూహమా?
నాదెండ్ల వ్యాఖ్యలను కూటమిలో విభేదాలుగా చూడాలా? లేక స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే సహజ రాజకీయ వ్యూహంగా చూడాలా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాదెండ్ల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది.


