అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన | Iran Claims It Destroyed Many US Jets Caused Serious Damage To Many More | Sakshi
Sakshi News home page

అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చేశాం, భారీ నష్టం : ఇరాన్ ప్రకటన

Jul 17 2026 4:06 PM | Updated on Jul 17 2026 4:57 PM

Iran Claims It Destroyed Many US Jets Caused Serious Damage To Many More

మధ్యప్రాచ్యంలో యుద్ధం  మళ్లీ  ఉద్రిక్త స్థాయికి  చేరింది. ఇరాన్‌పై అమెరికా రాత్రికి రాత్రే జరిపిన వైమానిక దాడులతో ఇరాన్‌ వార్‌ మరింత ముదిరింది. ఎనిమిది మంది ప్రాణాలు తీసిన అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక విమానాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు,  డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. జోర్డాన్‌లో మోహరించిన అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలను, ఇంధనం నింపే విమానాలను (Refuelling aircraft) పూర్తిగా ధ్వంసం చేశామని ఇరాన్‌  ప్రకటించడం కలకలం రేపింది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్  ప్రకటన
మధ్యప్రాచ్య ప్రాంతీయ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఇరాన్ మొదటిసారిగా తూర్పు సిరియాపై క్షిపణి దాడులు చేసింది. ఇరాన్‌లోని ఇరాన్‌షహర్‌లో తన సైనికుల మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. తాము అనేక అమెరికా ఇంధన సరఫరా విమానాలు, యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించినట్లు ఒక ప్రకటనలో  తెలిపింది. అంతేకాదు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని జోర్డాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే, ఇరాన్‌కు చెందిన 3 క్షిపణులను తాము కూల్చివేసామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని జోర్డాన్ సైన్యం పేర్కొన్న తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
 
ఇరాన్‌షహర్‌లో ఇరాన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా, సిరియా, జోర్డాన్, ఇరాక్ సరిహద్దుల్లోని 'అల్-తాన్ఫ్' లో ఉన్న అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌పై కూడా దాడి చేసినట్లు ఐఆర్‌జిసి తెలిపింది. అయితే, తాము ఫిబ్రవరిలోనే ఆ బేస్ నుండి వైదొలిగామని అమెరికా గతంలో ప్రకటించింది

ఇతర గల్ఫ్ దేశాలపై దాడులు 
అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న ఇతర గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతార్‌ఫై క్షిపణి దాడులు చేయడంతో పాటు, కువైట్‌లోని అత్యంత కీలకమైన విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ దెబ్బతీసింది. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్, సులేమానియా ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి. ఇరాన్ అసమ్మతి గ్రూప్ 'కొమాలా'ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారు.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

ఇరాన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్
శుక్రవారం ఇరాన్ జరిపిన పలు వైమానిక దాడులను బహ్రెయిన్ సాయుధ బలగాలు తమ వైమానిక రక్షణ వ్యవస్థల (Air defence systems) ద్వారా విజయవంతంగా అడ్డుకొని, ధ్వంసం చేశాయి. బహ్రెయిన్‌లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడాన్ని అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనగా బహ్రెయిన్ సైన్యం తీవ్రంగా ఖండించింది. అలాగే కూల్చివేసిన క్షిపణుల శిథిలాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

కాగా గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా కుప్పకూలిపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశించారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు అమెరికా.. ఇరాన్‌లోని కీలక ఓడరేవులు, వంతెనలు, విద్యుత్ గ్రిడ్‌లను ధ్వంసం చేసింది. ఇరాన్ తీరప్రాంత నగరాలైన అహ్వాజ్, బుషెహర్, బందర్ అబ్బాస్, కిష్ ఐలాండ్ వంటి ప్రాంతాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. రైల్వే లైన్లు, విమానాశ్రయాలు దెబ్బ తినడంతో ఇరాన్ లో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్తునుపొదుపగా వాడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ దాడుల్లో ఇరాన్ వైపు డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా, వందలాది మంది గాయపడినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. 

ఇదీ చదవండి: ఆ రూ. 40 వేలతోనే : రామమందిర్‌ విరాళాల గోల్‌మాల్‌ గుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement