టెహ్రాన్: అమెరికా,ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నపిల్లలకు వైద్యచికిత్స చేస్తున్న కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిందని అది అత్యంత అనాగరికత చర్యని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా చేసిన దాడులతో ఆసుపత్రి ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల క్యాన్సర్ చికిత్స విభాగంపై ఈదాడుల ప్రభావం పడిందని క్యాన్సర్ రోగులకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు కీమోథెరపీ చికిత్స అందించే ఈ ఆసుపత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చింది.
ఈ అంశమై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ ఈ దాడి "ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ జరిపిన క్రూరమైన దాడులను గుర్తుకు తెస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నపిల్లలకు ఈ దాడి తీవ్ర వేదనను, ఆందోళనను కలిగించింది.వెంటనే కీమోథెరపీ చేయించుకుంటున్న211 మంది రోగులను ఆసుపత్రి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇది తమ ప్రాణాల కోసం వీరోచితంగా పోరాడుతున్న చిన్నారులపై జరిగిన ఈ దాడి అత్యంత అమాయకులైన మానవులపై జరిగిన ఒక పిరికిపంద యుద్ధ నేరం " అని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు.
"మానవ హక్కుల గురించి నిరంతరం నీతులు చెప్పే దేశాలు, ఆసుపత్రులు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని చూసీచూడనట్లు నటిస్తున్నాయి. అలాంటి వారు తమ నైతిక విశ్వసనీయతను ఎప్పుడో పూర్తిగా కోల్పోయారు," అని మండిపడ్డారు.
ఇరాన్ అంతటా పేలుళ్లు - ప్రాణనష్టం
అల్ జజీరా నివేదిక ప్రకారం.. ఇరాన్లోని కెస్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్ సిరిక్ , చబహార్ , కొనారక్, రాస్క్ సిటీ,సహా పలు ప్రాంతాలపై అమెరికా దాడులతో తెగబడింది. అదే విధంగా ఇరాన్ ఆర్మీ స్థావరాలపై ఏకకాలంలో అమెరికా విరుచుకపడుతుంది. ఈ దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించారని, దేశవ్యాప్తంగా వందలాది మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇప్పటివరకు ఇరాన్లో కనీసం 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారని టెహ్రాన్ వెల్లడించింది.


