నర్సింగ్‌ విద్యకు ‘నకిలీ’ రోగం.. సర్కారు చికిత్స ఫెయిల్‌ | New colleges set up by showing fake beds in hospitals | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యకు ‘నకిలీ’ రోగం.. సర్కారు చికిత్స ఫెయిల్‌

Jul 17 2026 5:09 AM | Updated on Jul 17 2026 5:09 AM

New colleges set up by showing fake beds in hospitals

చోడవరంలో ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాల అనుమతుల వెనుక అవినీతి బాగోతం 

ఆస్పత్రుల్లో నకిలీ పడకలు చూపించి కొత్త కళాశాలల ఏర్పాటు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త నర్సింగ్‌ కళాశాలలకు అనుమతుల జారీలో గోల్‌మాల్‌ నడుస్తోంది. నకిలీ వైద్య అనుబంధ ఒప్పందాల (క్లినికల్‌ అఫిలియేషన్లు)తో కొత్త కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వెనుక అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. 51 సీట్లతో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సును ప్రారంభించేందుకు చోడవరంలో ఓ ప్రైవేట్‌ కళాశాలకు ప్రభుత్వం గత నెలలో అనుమతి ఇచ్చింది. సదరు విద్యాసంస్థకు చోడవరం, అనకాపల్లిలోని రెండు ప్రైవేట్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులతో క్లినికల్‌ అఫిలియేషన్‌ ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

వంద చొప్పున పడకలున్న ఈ రెండు ఆస్పత్రులతో క్లినికల్‌ అఫిలియేషన్‌ కోసం డీఎంఈ ఎన్‌ఓసీ ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. క్లినికల్‌ ఎస్టాబ్లిష్ మెంట్‌ ప్రకారం ఆ రెండు ఆస్పత్రుల్లో పడకలు కలిపిన వంద కూడా ఉండవని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఫిర్యాదులు రావడంతో ఆ రెండు ఆస్పత్రులకు అధికారికంగా మంజూరు చేసిన పడకల సంఖ్యపై క్లారిటీ ఇవ్వాలని నర్సింగ్‌ కౌన్సిల్‌ డీఎంహెచ్‌వోను వివరణ కోరినట్టు వెల్లడైంది. ఇలా కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేకుండా దరఖాస్తు చేసుకున్న సంస్థలకు అనుమతులు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. 

ఆర్భాటపు ప్రకటనలతో సరి 
2024లో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో నర్సింగ్‌ విద్యలో సంస్కరణలు చేపడతామని ఆర్భాటపు ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల్లో తనిఖీలు, ఆడిట్‌ అంటూ హడావుడి చేశారు. 60 శాతం విద్యాసంస్థలకు పేరెంట్‌ హాస్పిటల్స్‌ లేవు. ఇతర మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తేల్చారు. ఎక్కడికక్కడ లెక్కలు సెట్‌ అవ్వడంతో ప్రభుత్వం ఒక్కసారిగా గప్‌చుప్‌ అయిపోయింది. నాడు అవసరానికి మించి విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పిన జిల్లాల్లో కొత్త నర్సింగ్‌ కళాశాలలకు యథావిధిగా అనుమతులు ఇచ్చేస్తోంది. 

విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, తూర్పు గోదావరి, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అవసరానికి మించి కళాశాలలు ఉన్నాయని ప్రభుత్వం తేల్చింది. సత్యసాయి, నంద్యాల, ఏలూరు, కోనసీమ, అన్నమయ్య, శ్రీకాకుళం, బాపట్ల, ఏఎస్‌ఆర్‌ జిల్లాల్లోనే కళాశాలల అవసరం ఉందని గుర్తించింది. దీంతో ఆయా జిల్లాల్లోనే కొత్త కళాశాలలను ప్రోత్సహిస్తామని అప్పట్లో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటనలు కూడా చేశారు.

ఇప్పుడేమో ఇప్పటికే కాలేజీలు అధికంగా ఉన్న ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొత్త విద్యా సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చారు. మరోవైపు నర్సింగ్‌ వార్షిక పరీక్షల్లోనూ భారీగా కాపీయింగ్‌ జరుగుతోంది. జీఎన్‌ఎం కోర్సులకు సంబంధించిన పరీక్షల సమయంలో ఒక్కో సెంటర్‌లో 500–700 మంది విద్యార్థులతో రాయిస్తున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలో టెంట్ల కింద, హాస్టల్స్, డైనింగ్‌ హాల్స్‌లో సైతం విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement