పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన గురువారం మంత్రి వై.సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 89 శాతం పూర్తయినట్టు తెలిపారు.
ఫేజ్–1 పనులకు కేంద్రం రూ.30,436 కోట్లు మంజూరు చేసిందని, నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ తొలి దశ పనులను వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విష్ణుకుమార్రాజు, ఈశ్వరరావు, పార్థసారథి హాజరయ్యారు.


