‘తెల్ల’బోయిన ప్రభుత్వ వైద్యం | Conspiracies against the government medical sector in AP | Sakshi
Sakshi News home page

‘తెల్ల’బోయిన ప్రభుత్వ వైద్యం

Jul 17 2026 4:46 AM | Updated on Jul 17 2026 4:46 AM

Conspiracies against the government medical sector in AP

రాష్ట్రంలో కుంటుపడిన ప్రభుత్వ వైద్యరంగం

తేటతెల్లం చేసిన ఎన్‌ఎంసీ 2026–27 సీట్‌ మ్యాట్రిక్స్‌ 

5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో 19 మెడికల్‌ కాలేజీలు  

మనకంటే చిన్నదైన తెలంగాణలో 36 ప్రభుత్వ కాలేజీలు 

75 లక్షల జనాభా ఉన్న హిమాచల్‌లో 6 కాలేజీలు ప్రభుత్వం ఆ«దీనంలోనే.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7 ప్రభుత్వ కాలేజీలకు అనుమతి.. వాటిలో 4 ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికే.. 

ఏపీలో పీపీపీలో ప్రభుత్వ వైద్యవిద్య ప్రైవేట్‌కు ధారాదత్తం

సాక్షి, అమరావతి: దేశంలోని చిన్న రాష్ట్రాలు సైతం ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో రికార్డులు సృష్టిస్తూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను, సామాన్యుడికి ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏకంగా 10 కళాశాలలను పీపీపీ విధానం పేరిట కారుచౌకగా ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) విడుదల చేసిన నివేదిక ఏపీలోని ప్రభుత్వ వైద్యరంగం దుస్థితిని బట్టబయలు చేసింది.

ఏపీకంటే తెలంగాణ మిన్న
ఎన్‌ఎంసీ 2026–27 విద్యా సంవత్సర సీట్‌ మ్యాట్రిక్స్‌ ప్రకారం.. జనాభాపరంగా ఏపీ కంటే చిన్నదైన తెలంగాణలో ప్రతి 10 లక్షల జనాభాకు 116 ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లు, హిమాచల్‌ప్రదేశ్‌లో 96 సీట్లు ఉంటే.. ఏపీలో ఆ సంఖ్య కేవలం 66 సీట్లకే పరిమితమై హిమాచల్‌ కంటే హీనమైన స్థితికి చేరుకుంది. తెలంగాణ, తమిళనాడు లేదా దేశంలోనే అత్యంత వెనుకబడిన ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా.. ఏపీలో ఎకరం భూమిని కేవలం రూ.100 లీజుకు ఇస్తూ.. ప్రజల నుంచి వైద్య సేవలకు డబ్బు వసూలు చేసుకునేలా ప్రైవేట్‌ శక్తులకు ప్రజా సంపదను ధారాదత్తం చేస్తున్నారు. బాబు సర్కార్‌ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయాల వల్ల రాష్ట్ర విద్యార్థులు ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోతుండగా.. ప్రతిభావంతులైన నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల డాక్టర్‌ కలలు కల్లలవుతున్నాయి. మరోవైపు సామాన్యుడికి ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.

ఎన్‌ఎంసీ విడుదల చేసిన సీట్‌ మ్యాట్రిక్స్‌ ప్రకారం..
 రాష్ట్రాల వారీగా ప్రతి 10 లక్షల జనాభాకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలను పరిశీలిస్తే ఏపీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది.
 తెలంగాణలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా.. వీటిలో 4,400 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 116 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జమ్మూ, కశ్మీర్‌లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,525 సీట్లు ఉన్నాయి. అక్కడ ప్రతి 10 లక్షల జనాభాకు 112 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో 6 ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 96 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏపీలో 5.3 కోట్ల జనాభాకు 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 3,515 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 66 సీట్లు మాత్రమే ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నాయి.

పీపీపీ విధానంతో సీట్ల నష్టం ఇలా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలని ప్రతిపాదించి.. పనులు కూడా ప్రారంభించారు. ఆ పనులు వివిధ దశల్లో ఉండగా.. చంద్రబాబు గద్దెనెక్కారు. ఆ వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 10 కళాశాలలను పీపీపీ (ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌) విధానంలోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీంతో గత రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోయారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700 సీట్లు, 2025–26 విద్యా సంవత్సరం 1,750 సీట్ల చొప్పున రెండేళ్లలో ఏపీ విద్యార్థులు 2,450 ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లను నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు 2026–27 విద్యా సంవత్సరంలో ఎన్‌ఎంసీ దేశంలో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 7 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చింది. వీటిలో ఏకంగా 4 కళాశాలలు ఒక్క ఛత్తీస్‌గఢ్‌ నుంచే అనుమతి పొందాయి. ఏపీకి సంబంధించి జగన్‌ హయాంలో నిర్మించిన ఒక్క పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు మాత్రమే ఈ ఏడాది అనుమతి లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement