గిట్టుబాటు ధర లభించక కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు
మీ బెదిరింపులకు భయపడం.. కూటమి అరాచకాలను తిప్పికొడతాం
పొగాకు రైతు దీక్షలో వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీమంత్రి కారుమూరి
కనిగిరి రూరల్: అన్నివిధాల తీవ్రంగా నష్టపోయిన రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు రైతులకు మద్దతుగా మార్కాపురం జిల్లా కనిగిరిలో గురువారం పొగాకు రైతు దీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ దీక్షలో పెద్దఎత్తున పొగాకు రైతులు పాల్గొన్నారు. ఈ దీక్షలో కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
రెండేళ్ల కూటమి పాలనలో మూడు పంటలు వచ్చాయని, ఒక్క పంటకూ బీమా చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ‘గొంతు విప్పి వాస్తవాలు మాట్లాడితే అక్రమ కేసులు పెడతారా? కుటుంబాలను జైల్లో పెడతారా? ఎన్నాళ్లు సాగుతుంది మీ అరాచక పాలన. మీరు ఏం చేసినా భయపడం.. ప్రజలకు అండగా నిలబడతాం.. వారి తరఫున పోరాటాలు చేస్తాం’ అని చెప్పారు. మీ హామీల గురించి మాట్లాడితే మా గొంతులు నొక్కేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటారని, రైతులకు అండగా నిలబడేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
రైతులను పట్టించుకోని చంద్రబాబు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు నాలుగు నెలలుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. బడ్జెట్లో రైతుల కోసం రూ.వెయ్యికోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంతవరకు పోరాటాలు చేస్తామని చెప్పారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ సొంత నియోజకవర్గం కుప్పంకు నీళ్లివ్వని చంద్రబాబు రైతులకు ఏం మేలు చేస్తాడని విమర్శించారు. చేయిచేయి కలుపుదాం.. పొగాకు రైతు కోసం పోరాడదాం.. అని పిలుపునిచ్చారు.
జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మాట్లాడారు. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు కసుకుర్తి ఆదెన్న, కుందురు నాగార్జునరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు వై.ఎం.ప్రసాద్రెడ్డి (బన్నీ), డాక్టర్ వెంకయ్య, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


