పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే.. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబ్ అల్-మందెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సూచించింది!. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇప్పటికే హౌతీలు క్షిపణులు, డ్రోన్లను బాబ్ అల్-మందెబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి, ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
బాబ్ అల్-మందెబ్ జలసంధి(Bab al-Mandab Strait) ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో అనుసంధానించే ఈ జలసంధి మీదుగానే ఆసియా-యూరప్ మధ్య పెద్దఎత్తున చమురు, సహజవాయువు, ఇతర వాణిజ్య సరకు రవాణా జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించేందుకు టెహ్రాన్ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్పై నేరుగా దాడులు జరిగితే సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా, ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపించేలా వ్యూహం అమలు చేసే అవకాశాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
.. ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్థాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్థాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్థాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే.. పాకిస్థాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి "సౌదీపై దాడి అంటే పాకిస్థాన్పైనే దాడిగా పరిగణిస్తాం. అదే మా రెడ్లైన్" అని రాయిటర్స్కు చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే.. ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు.. ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి ఘర్షణకు దారితీయకపోయినా, ఇరాన్, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ల ప్రయోజనాలు ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతోంది. బాబ్ అల్-మందెబ్, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది.


