సాక్షి, గుంటూరు: కూటమి సర్కార్ పాలన, చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 75 శాతం మీడియా చంద్రబాబు కబంధ హస్తాలలో ఉంది. ప్రజలకు మంచి చేసే విధంగా ఆ మీడియా ఏదీ ప్రసారం చేయదంటూ మండిపడ్డారు. ఏపీలో ప్రతీ ఒక్కరూ జగన్ 2.0 యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో జగన్ 2.O సూపర్ యాప్ పోస్టర్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, డైమండ్ బాబు, పోతిన మహేష్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..‘చంద్రబాబు అనుకూల మీడియా.. వాస్తవాలను, వైఎస్సార్సీపీకి చెందిన వార్తలను కవర్ చేయదు. పోనీ.. సోషల్ మీడియా ద్వారా అయినా నిజాలు తెలుసుకుంటారని అనుకుంటే వాటి మీద కూడా కుట్ర పన్నుతున్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే వీడియోలు చంద్రబాబు తీసివేస్తున్నాడు. ఇదేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. అందుకే ప్రజలు వాస్తవాలు తెలుకోవాలన్నా.. వైఎస్సార్సీపీ వార్తలు, వీడియోలు చూడాలన్న జగన్ 2.O సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అన్ని వార్తలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ జగన్ 2.O యాప్ను డౌన్ లోడ్ చేసుకోండి’ అని వ్యాఖ్యలు చేశారు.


