20వ రోజుకు వాంగ్‌చుక్‌ దీక్ష.. వైద్యుల హెచ్చరిక! | 9 Kg Weight Loss And Failing Health, Sonam Wangchuk 20-Day Hunger Strike Raises Health Concerns Amid Growing Protest | Sakshi
Sakshi News home page

20వ రోజుకు వాంగ్‌చుక్‌ దీక్ష.. వైద్యుల హెచ్చరిక!

Jul 17 2026 10:49 AM | Updated on Jul 17 2026 11:06 AM

Sonam Wangchuks Health Deteriorates After 20 Days of Hunger Strike

దేశ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, అలాగే లడఖ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. ఆయన దీక్ష నేటితో(శుక్రవారం)20వ రోజుకు చేరుకోగా.. వైద్యులు తాజా హెల్త్‌ అప్‌డేట్‌ రిలీజ్‌ చేశారు. శరీరంలో కీలక మార్పులు మొదలయ్యాయని.. పరిస్థితి మరింత దిగజారితే అవయవాల పనితీరుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

తాజా వైద్య నివేదిక ప్రకారం.. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్‌చుక్‌ 9 కిలోలకు పైగా బరువు తగ్గి ప్రస్తుతం 56.9 కిలోలకు చేరుకున్నారు. దీర్ఘకాల ఉపవాసంలో శరీరం మొదట గ్లూకోజ్‌ నిల్వలను ఉపయోగించుకుంటుందని, ఆ తర్వాత కొవ్వు, కండరాలను కరిగించడం ప్రారంభిస్తుందని వైద్యులు తెలిపారు. ఆయనలో కీటోన్‌ స్థాయి పెరగడం, యూరిక్‌ యాసిడ్‌ పెరిగిన స్థాయిలో నమోదవడం లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే తదుపరి దశలో గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

జూన్‌ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వాంగ్‌చుక్‌ నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. పరీక్షల పేపర్‌ లీకులు, నీట్‌ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణించడంతో.. వ్యవహారం కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించింది. వాంగ్‌చుక్‌కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే తక్షణ వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. ఆయన ప్రాణం విలువైనదని, అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని.. అవసరమైతే ఫోర్స్‌ ఫీడింగ్‌(బలవంతంగా ఆహారం అందించాలని) కోర్టు సూచించింది.

తగ్గేదే లే అంటున్న వాంగ్‌చుక్‌
తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి వాంగ్‌చుక్‌ భరోసా ఇచ్చారు. తనకు బాగానే ఉందంటూ ప్రకటించారు. వైద్య పరీక్షల్లో పెద్ద సమస్యలు బయటపడలేదని.. మద్దతుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా దీక్ష విరమిస్తే తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. జూలై 20న నిర్వహించనున్న పార్లమెంట్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

పెరుగుతున్న మద్దతు.. 
వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జంతర్‌ మంతర్‌కు వెళ్లి వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలిపారు. ప్రతి ఏడాది పేపర్‌ లీక్‌లతో యువత నష్టపోతున్నారని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వినాలని కేజ్రీవాల్‌ కోరారు. మరోవైపు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కూడా వాంగ్‌చుక్‌ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసింది.

సినీ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. జూలై 20న చేపట్టనున్న పార్లమెంట్‌ మార్చ్‌లో సుమారు 1.5 లక్షల మంది పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తానని సోనమ్‌ వాంగ్‌చుక్‌ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement