ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్లో పేదరిక రేటు భారీగా పెరిగింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదుడుకులు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాల వల్ల దాదాపు ప్రతి 10 మందిలో ముగ్గురు (28.9 శాతం మంది) పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
‘డాన్’ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. పాకిస్తాన్ తాజా హౌస్హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే (హెచ్ఐఈఎస్), పాకిస్తాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్మెంట్ (పీఎస్ఎల్ఎం) గణాంకాల ఆధారంగా 2024-25 నాటికి జాతీయ పేదరిక రేటు 28.9 శాతానికి చేరింది. 2018-19లో ఇది 21.8 శాతంగా ఉండేది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ సర్వే దేశవ్యాప్తంగా జీవన ప్రమాణాలు ఏ విధంగా దిగజారాయో స్పష్టం చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాలు ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం సుమారు ఎనిమిది శాతం మేర పెరగగా, పట్టణ ప్రాంతాల్లో ఆరు శాతం పెరిగింది. చెల్లింపుల సంక్షోభాలు, కొవిడ్-19 మహమ్మారి, నిరంతర ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరలు, సుదీర్ఘ ఆర్థిక సర్దుబాటు చర్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
ఇది కూడా చదవండి: సొరంగంలో విషాదం.. పలువురు కార్మికులు గల్లంతు!


