source: X
పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) వింత కండీషన్ పెట్టింది. లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ పొందే ఆటగాళ్ల ఫిట్నెస్ మెరుగుపరిచేందుకు 'పాడెల్' ఆటను తప్పనిసరి చేసింది. ప్రతి రెండో రోజు 40 నిమిషాల పాటు ప్రతి ఆటగాడు పాడెల్ గేమ్ను ఆడాల్సిందేనని ప్రకటన జారీ చేసింది.
పీసీబీ సీనియర్ సెలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ ఆకిబ్ జావెద్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల చురుకుదనం, రిఫ్లెక్సులు, కదలికలు, ఫీల్డింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ చర్య లక్ష్యమని ఆయన చెప్పారు.
ఇప్పటికే పలువురు క్రికెటర్లు పాడెల్ ఆడుతున్నప్పటికీ, అందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆకిబ్ తెలిపారు. ఇప్పుడు ఎన్సీఏలోనే ప్రత్యేక పాడెల్ కోర్టును ఏర్పాటు చేయడంతో శిక్షణతో పాటు ఈ ఆటను కూడా ఆడే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
టెన్నిస్, స్క్వాష్ అంశాల కలయికతో ఆడే పాడెల్ చిన్న కోర్టులో జరిగినప్పటికీ, అధిక స్థాయి ఫిట్నెస్, వేగం, స్టామినా అవసరమయ్యే క్రీడగా గుర్తింపు పొందింది. అందుకే దీన్ని క్రికెటర్ల శిక్షణలో భాగం చేశామని ఆకిబ్ వెల్లడించారు.
అంతేకాకుండా, భవిష్యత్తులో ఎన్సీఏలో బాస్కెట్బాల్ కోర్టులు, స్నూకర్తో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అత్యాధునిక ఏఐ (AI) బౌలింగ్ మెషీన్ను అకాడమీలో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆటగాళ్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే పీసీబీ లక్ష్యమని ఆకిబ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో భాగంగా మూడు టెస్ట్లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ పర్యటనతో కెప్టెన్గా బాబర్ ఆజం శకం మళ్లీ మొదలవుతుంది. మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తొలగించి బాబర్కు కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ కట్టబెట్టారు.


