పాకిస్థాన్ ఉనికినే ప్రశ్నిస్తూ, ఆ దేశపు అతిపెద్ద ప్రావిన్స్(రాష్ఠ్రం) ‘బలూచిస్తాన్’ నుండి ఒక సంచలన ప్రకటన వెలువడింది. బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ సోషల్ మీడియాలో చేసిన ఒక వైరల్ ట్వీట్ అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతంలోని 85 శాతం భూభాగంపై తమ నియంత్రణ ఉందని ఆయన పేర్కొనడం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సొంత జెండా, జాతీయ గీతం ‘బలూచీ ఫాలూస్’ పేరుతో కొత్త కరెన్సీని కూడా ప్రకటించడంతో, ఈ ప్రాంతం మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో చర్చాంశంగా మారింది.
బలూచిస్తాన్ ఎందుకు కీలకం?
పాకిస్థాన్ మొత్తం వైశాల్యంలో అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్తాన్, ఆ దేశానికి ప్రాణవాయువు వంటిది. ఇది కేవలం భౌగోళికంగానే కాకుండా, ఖనిజ సంపద పరంగానూ ఎంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ బంగారం, రాగి, సహజ వాయువు, బొగ్గు వంటి అరుదైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రావిన్స్ గనుక పాకిస్థాన్ నుంచి విడిపోతే, పాక్ ఆర్థిక స్థితిగతులు కుప్పకూలడం ఖాయం. అత్యంత వ్యూహాత్మకమైన ఈ ప్రాంతం, ఆసియా దేశాల మధ్య ఒక ప్రధాన ‘గేట్వే’గా పనిచేస్తోంది.
దశాబ్దాల సుదీర్ఘ పోరాటం
1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పటి నుండే బలూచిస్తాన్లో నిరసనలు మొదలయ్యాయి. 1950, 60, 70 దశకాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. స్వయంప్రతిపత్తి కోసం, తమ సహజ వనరులపై తమకే హక్కు ఉండాలని, మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని కోరుతూ వీరు దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
కళాత్ సంస్థానం చరిత్ర
బలూచిస్తాన్ చరిత్ర 1947 నాటిది. విభజన సమయంలో కళాత్, మకరన్, లాస్ బేలా, ఖారన్ అనే నాలుగు స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. అందులో కళాత్ అత్యంత శక్తివంతమైనది. 1947 ఆగస్టు 11న ఖాన్ ఆఫ్ కళాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. కానీ 227 రోజుల తర్వాత, 1948 మార్చి 20న, బలవంతంగా పాకిస్థాన్లో విలీనం చేయబడింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పాక్ దమనకాండకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం రగిలిపోతూనే ఉంది.
పేదరికంలో మగ్గుతున్న సంపన్న ప్రాంతం
పాకిస్థాన్లోని ఇతర ప్రాంతాలకు గ్యాస్, విద్యుత్ అందిస్తున్న బలూచిస్తాన్, దురదృష్టవశాత్తూ పేదరికంలో కూరుకుపోయింది. ఇక్కడ 70 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. తమ వనరులను కేంద్రం దోచుకుంటోందని, తమకు దక్కాల్సిన అభివృద్ధి అందడం లేదని బలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షే ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సంస్థలు ఆయుధాలు పట్టేలా చేసింది.
చైనాకు బలూచిస్తాన్ ఎందుకు ముఖ్యం?
చైనా చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్’కు బలూచిస్తాన్ గుండెకాయలాంటిది. 65 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా, పశ్చిమ ప్రాంతాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానించాలని చూస్తోంది. ముఖ్యంగా గ్వాదర్ ఓడరేవు చైనాకు ఎంతో కీలకం. ఇది ప్రపంచ వాణిజ్య మార్గాలను శాసించడానికి, మలక్కా జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనాకు ఉన్న ఏకైక మార్గం.
ఆయుధ సంపత్తిపై పాక్ ఆందోళన
బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద ఇప్పుడు అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా పార్లమెంట్లో అంగీకరించారు. పాక్ సైన్యం వద్ద ఉన్న ఆయుధాల కంటే శక్తివంతమైనవి విద్రోహుల వద్ద ఉన్నాయని ఆయన చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ తిరుగుబాటును అణచివేయడం పాకిస్థాన్కు సవాలుగా మారింది.
స్వతంత్ర దేశం అయ్యే అవకాశం ఉందా?
ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గుర్తింపు రావడం కష్టమైనప్పటికీ, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారాలనే ఆకాంక్ష ఏమాత్రం తగ్గలేదు. పాకిస్థాన్ తన సైనిక శక్తితో ఎంత అణచివేసినా, బలూచ్ ప్రజల స్వేచ్ఛాకాంక్ష రోజురోజుకూ బలపడుతోంది. అధికారిక గుర్తింపు లేకపోయినా, ఈ ప్రాంతం పాకిస్థాన్ అస్థిరతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రపంచం మెచ్చిన పాట.. సింగర్కు దక్కింది ఇంతేనా?


