టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత దేశ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఆయనకు ఘన నివాళులు అర్పించాల్సిన అంత్యక్రియలే అధికార పోరుకు వేదికగా మారాయి. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీపై అమెరికాతో రాజీని వ్యతిరేకించే అతివాదులు బహిరంగంగా విమర్శలు గుప్పించడం, అమెరికాతో రాజీకి వెళ్లారని దేశద్రోహులుగా ముద్ర వేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఖమేనీ అంతిమయాత్రలో పాల్గొన్న అధ్యక్షుడు పెజెష్కియన్ను లక్ష్యంగా చేసుకుని అతివాదులు కొందరు ట్రంప్తో రాజీపడ్డవారికి మరణం అంటూ నినాదాలు చేశారు. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అరాఘ్చీపై కొందరు రాళ్లు విసిరారు. దేశాన్ని అమ్ముకున్న వ్యక్తి అంటూ దూషించారు.
కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ?
ఖమేనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ ప్రజల్లో కనిపించకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన నిజంగా పాలనను నడిపిస్తున్నారా? లేక ఆయన పేరుతో ఇతర నేతలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాఘ్చీలు మోజ్తాబా ఖమేనీ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మొజ్తబాపై తిరుగుబాటు
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ నిపుణుడు అరాష్ అజీజీ వ్యాఖ్యానిస్తూ.. మొజ్తబా ఖమేనీ ప్రజల్లో కనిపించకపోవడంతో ఘాలిబాఫ్, ఆయన మిత్రులే పాలనను నడిపిస్తున్నారనే అభిప్రాయం బలపడింది. దీంతో అతివాదులు మొజ్తబాపై తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అని అన్నారు. అతివాది ఎంపీ మహ్మూద్ నబవియన్ కూడా సోషల్ మీడియాలో ఇరాన్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా?" అంటూ ప్రశ్నిస్తూ, తర్వాత ఖమేనీ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తిరుగుబాటు దారుల్ని అడ్డుకుంటాం అని ప్రకటించారు.
అధ్యక్షుడికి బహిరంగ బెదిరింపులు
రాజకీయ విమర్శలు వ్యక్తిగత బెదిరింపుల దాకా వెళ్లాయి. ఐఆర్జీసీతో అనుబంధం ఉన్న మతగాయకుడు మొహమ్మద్ అలీ బఖ్షీ.. సుప్రీం లీడర్ ఆదేశాలు అమలు చేయకపోతే కత్తి మీ గొంతుకే చేరుతుంది. మీకు నరకం చూపిస్తాం’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియన్ను హెచ్చరించారు. అయినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఎక్కువకాలం నిలవలేదు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకలపై దాడులు ప్రారంభించడంతో అమెరికా ప్రతిదాడులకు దిగింది. దీంతో అతివాదులు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని, అమెరికా-ఇజ్రాయెల్లపై మరింత దూకుడుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మాజీ విదేశాంగ మంత్రి మనూచెహర్ మొట్టాకీ కూడా ప్రాంతంలోని ఏదైనా అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి వందమంది అమెరికా సైనికులను బందీలుగా తీసుకురావాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవలి పరిణామాల్లో అతివాదుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు కనిపిస్తున్నాయి. ఐఆర్జీసీ మద్దతురాలు ఎంపీ మహ్మూద్ నబవియన్ను పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ నుంచి తొలగించారు. అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకించిన మరో సభ్యుడినీ తప్పించారు.
జర్మనీకి చెందిన భద్రతా విశ్లేషకుడు హమీద్రెజా అజీజీ అభిప్రాయం ప్రకారం.. ఘాలిబాఫ్ హార్డ్లైన్ వర్గాలను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. దేశంలో అస్థిరత పెరుగుతున్న వేళ ఈ వర్గాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి అని పేర్కొన్నారు.
ఒకే లక్ష్యం.. కానీ విభేదాలు
అంతర్గతంగా తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ ఇరాన్ నాయకత్వం మొత్తం ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం పొందడం, హర్మూజ్ జలసంధిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అయితే వాటిని సాధించడానికి అమెరికాతో రాజీ పడాలా? లేక సైనికంగా ప్రతిస్పందించాలా? అన్న విషయంలోనే అధికార వర్గాల్లో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.
🔻حمله مخالفان توافق به عراقچی با شعار:
«مرگ بر وطنفروش خائن» «بیشرف، بیشرف»
🔻شعار «مرگ بر سازشگر» در حضور پزشکیان در مراسم تشییع جنازه خامنهای.
🔻 Opponents of the agreement attack Araqchi with the slogans: "Death to the traitorous sellout!" and "Dishonorable!… pic.twitter.com/ThBhZLP1tf— Siamak Tadayon Tahmasbi (@SiamakTadayonT) July 6, 2026


