వరుసగా ఏడోరోజూ ఇరాన్పై రాత్రి దాడులతో రెచ్చిపోయిన అమెరికా
7 రోజుల్లో ఇరాన్లో 50 మంది దుర్మరణం
దక్షిణ ఇరాన్లో డీసాలినేషన్ ప్లాంట్పై అమెరికా దాడి
ప్రతిగా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ దాడులు
ఇరాన్ దాడుల్లో ధ్వంసమైన కువైట్ విద్యుత్ ఉత్పత్తి, డీసాలినేషన్ ప్లాంట్లు
దుబాయ్: ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి వరుసగా ఏడోరోజూ ఇరాన్పై అమెరికా సేనలు రాత్రిపూట దాడులను శనివారమూ కొనసాగించాయి. దీంతో ఇరాన్వ్యాప్తంగా అమెరికా దాడుల్లో గత ఏడు రోజుల్లో చనిపోయిన ఇరానియన్ల సంఖ్య 50కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. జూన్ 27 తర్వాత అమెరికా మొదలెట్టిన భీకర దాడుల్లో ఇప్పటిదాకా 500 మందికిపైగా గాయపడ్డారు.
శనివారం సైతం ఇరాన్లోని మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై అమెరికా పదులకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది. నిఘా ప్రాంతాలు, సాయుధ ఉపకరణాలు, రహదారులు, వంతెనలు, భూగర్భ ఆయుధాగారాలు, నావికాదళ సామర్థ్యాలను నాశనంచేశామని శనివారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడిలో దక్షిణ ఇరాన్లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది.దీంతో ఈ ప్లాంట్ నుంచి 20 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జనం అల్లాడిపోయారని హార్మూజన్ ప్రావిన్స్ డెప్యూటీ గవర్నర్ ఇస్లాయిల్ దెహస్తానీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిదాడులు ఆరంభించిన ఇరాన్..
దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా పేట్రేగిపోతున్నా మౌనం దాల్చిన దాని మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణులకు పనిజెప్పింది. దీంతో కువైట్లోని నీటి శుద్ధీకరణ(డీసాలిలేషన్)ప్లాంట్, విద్యుత్ఉత్పత్తి కేంద్రాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. చమురుశుద్ధి కర్మాగారంపై దాడిలో పలువురు కువైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు. దాడులతో పల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో ఉత్పత్తిని వెంటనే నిలిపేశారు.
కువైట్లోని డీసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడిచేయడం వరుసగా ఇది రెండోరోజు. కువైట్ తన తాగునీటి అవసరాల కోసం 90 శాతం డీసాలినేషన్ ప్లాంట్ల మీదనే ఆధారపడుతోంది. ఇరాన్ దాడుల కారణంగా మంటల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అగ్నిమాపక సిబ్బంది,కారి్మకులు గాయపడ్డారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
క్షిపణులు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా విమానాశ్రయాల నుంచి రాకపోకలను కువైట్ నిలిపేసింది. ఇరాక్లోని ఇర్బిల్ నగరంపైనా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. బహ్రెయిన్లో ముందుజాగ్రత్తగా సైరన్లు మోగించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తంచేసింది. సౌదీ అరేబియా సైతం రెండు ప్రాంతాల్లో హెచ్చరికలగా సైరన్లు మోగించి తర్వాత నిలిపేసింది. అమెరికా సేనలకు ఆశ్రయం కల్పించే ప్రతి పశ్చిమాసియా దేశంపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) శనివారం పునరుద్ఘాటించింది.
మర్చిపోలేని గుణపాఠం చెప్తాం: మొజ్తబా అమెరికాకు ఖమేనీ హెచ్చరిక
దుబాయ్: తమ దేశంపై ఇంకా దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని అమెరికాను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ప్రభుత్వ టీవీ ఛానల్లో చదివి వినిపించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీంలీడర్గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది అని మొజ్తబా తేల్చిచెప్పారు.
జోర్డాన్పై దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి
దుబాయ్: జోర్డాన్లోని తమ స్థావరాలపై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని, ఒకరి జాడ గల్లంతైందని అమెరికా సైన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిలువరించేందుకు అమెరికా, జోర్డాన్ సైనిక సిబ్బంది ప్రయత్నిస్తుండగా తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా శనివారం పేర్కొంది. ఇరాన్ దాడుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. వాళ్లకు సమీప ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్చేశారు. చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికుల పూర్తి వివరాలను సైన్యం ఇంకా బయటపెట్టలేదు.


