ఢిల్లీ: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ముందు పాకిస్తాన్ సైన్యం ఘోరంగా విఫలమైందని.. ఆ పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికే పాక్ మిలిటరీ విజయం సాధించామంటూ అబద్ధపు ప్రచారాన్ని సృష్టించిందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 'ఆపరేషన్ సింధూర్'లో పాకిస్తాన్ సైనిక నాయకత్వం ప్రజలకు చెప్పినట్లుగా ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' అపార విజయం సాధించిందని.. తమ సైన్యం ఓటమిని అంగీకరించలేక నిజాలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇజ్రాయెల్, పాకిస్థాన్ సంబంధాలపైనా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని దేశాలు ఇప్పటికీ ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించడం లేదన్నారు. ఆ లిస్ట్లో ఉన్న పాకిస్థాన్.. ఇటీవల ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేస్తుండటం కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్రతరం కాకపోవడానికి కారణమని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ 'అబ్రహం అక్కార్డ్స్’లో చేరి.. ఇజ్రాయెల్ను స్వతంత్ర దేశంగా గుర్తించే దిశగా అడుగులు వేయించేందుకే అంటూ ఆమె ఆరోపణలు గుప్పించారు.
ఈ యుద్ధం.. మరింత పెద్దది కాకుండా నిలిచిపోవడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని.. పాకిస్తాన్ నాయకత్వం తమ పరువు కాపాడుకోవడానికి ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని సహాయం చేశారని తెలిపారు. కాగా, నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ సైనిక వర్గాల్లో కలకలం రేపాయి. ఈ ప్రకటనలు వెలువడిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NCCIA) ఆమెకు నోటీసులు జారీ చేసింది.


