సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే క్రికెట్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆస్ట్రేలియా బరిలోకి దిగనుండగా.. గత ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టుపై కూడా ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మెగా టోర్నీ కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలో బలమైన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాయారు చేస్తోంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లపై కూడా సెలక్టర్లు దృష్టి సారించారు. ఇందులో భాగంగా హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ వంటి యంగ్ ప్లేయర్లను పరీక్షిస్తున్నారు. అంతేకాకుండా యశస్వి జైశ్వాల్ను రోహిత్ శర్మకు బ్యాకప్గా మేనెజ్మెంట్ సిద్దం చేస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 కోసం పటిష్టమైన భారత ప్లేయింగ్ ఎలెవన్ను ఆంధ్ర మాజీ క్రికెటర్ హనుమా విహారి ఎంపిక చేశాడు. గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాకు తను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్లో విహారి చోటిచ్చాడు.
భువీ, కృనాల్ వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఆర్సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అయితే గత రెండు సీజన్లలోనూ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడిని తిరిగి భారత జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇక విహారి తన జట్టులో ఓపెనర్లగా రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్నే కొనసాగించాడు. అదేవిధంగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు అతడు అవకాశమిచ్చాడు.
కాగా హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. అతడు భారత వన్డే ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్తో పాటు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లకు ఛాన్స్ ఇచ్చాడు. సిరాజ్ కూడా ప్రస్తుతం వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు.
విహారి ఎంపిక చేసిన భారత తుది జట్టు
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


