PC: BCCI X
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.
ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్
ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.
ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.
వారికే పెద్దపీట
టాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.
ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.
ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు.
వీళ్లు కూడా ఉండవచ్చు
అయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.
వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టు
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.
చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్!


