మైనర్ బాలిక మేనమామ, బాబాయ్ సహా మరో ఇద్దర్నీ టార్గెట్ చేశాడా అనే అనుమానాలు
సెల్ఫీ వీడియోలో వారి పేర్లు ప్రస్తావించిన పోక్సో కేసు నిందితుడు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసి, చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన పోక్సో కేసు నిందితుడు పార్వతి రాజ్కుమార్ (28) హిట్లిస్ట్లో మరో నలుగురు కూడా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల ఫిర్యాదు, పోక్సో కేసు నమోదుకు బాలిక మేనమామ రాజు, బాబాయ్ చిట్యాల శ్రీనివాస్ ఆయన సతీమణి, నరేష్ కూడా సహకరించారంటూ రాజ్కుమార్ హత్యాకాండకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది.
మైనర్ బాలిక కుటుంబంతో పాటు తన భార్య పిల్లలను ఎందుకు చంపాల్సి వస్తోందో నాలుగు పేజీల స్టాంప్ పేపర్లపై రాసి పెట్టడం గమనార్హం. తాను ఆర్థికంగా నష్టపోవడానికి, కేసుల పాలై పరువు ప్రతిష్టలను కోల్పోవడానికి వారు కూడా కారణమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో.. ఘటన సమయంలో ఆ నలుగురు అక్కడ లేక పోవడం వల్లే బయటపడ్డారా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
బెయిల్ కోసం డీల్!
పోలీసులు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించి ఉంటే ఆరుగురి ప్రాణాలు పోయేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే 16న పోక్సో కేసు నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, కేసును పూర్తిగా నీరుగార్చుతూ నిందితునికి సులభంగా బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేసినందుకు ప్రతిఫలంగా రూ.25 లక్షల నగదు లంచంగా ఇచ్చేందుకు రాజ్కుమార్ డీల్ కుదుర్చుకున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నా యి. దీనిపై ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్జోషి రహస్య విచారణ చేపట్టారని, బెయిల్ డీల్ వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
తేరుకుంటున్న షాబాద్
ఆరు హత్యలతో మూడురోజుల పాటు తీవ్ర ఉద్రిక్తంగా మారిన షాబాద్, దైవాలగూడలు క్రమంగా తేరుకుంటున్నాయి. సోమవారం వరకు షాపులు, ఆఫీసులు బంద్ చేసిన స్థానిక వ్యాపారులు మంగళవారం యథావిధిగా వ్యాపార కార్యకలాపాల్లో మునిగిపోయారు.
పురుగుల మందు ఎక్కడి నుంచి వచ్చింది?
రాజ్కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తుండగా, అతను పురుగుల మంద ఎక్కడ కొనుగోలు చేశాడనేది మిస్టరీగా మారింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పురుగుల మందు సీసా కొనుగోలు చేశాడా? ఎక్కడ కొనుగోలు చేశాడనేది పోలీసులకు కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు.
పోలీసులు మూడు రోజులపాటు జరిపిన తనిఖీల్లో నిందితుడు ఏ ఒక్క సీసీ కెమెరాలోనూ కన్పించలేదు. దీంతో ఘటనకు ముందే కొనుగోలు చేసి దాన్ని వెంటపెట్టుకుని తిరిగాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొనుగోలుదారు వివరాలు తీసుకోకుండా ఎరువుల దుకాణాల యజమానులు పురుగుల మందు విక్రయించరని, కొనుగోలు చేసిన తర్వాత రసీదు కూడా ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కొన్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


