300 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో బిట్స్పిలానీ, టీ–హబ్ హైదరాబాద్ను ‘హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్’(టీబీఐ)లుగా నామినేట్చేశారు. రాష్ట్రస్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ మే 29న ప్రారంభం కాగా తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు, సూక్ష్మ వ్యాపారాలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు దోహదపడనుంది. మహిళలు కేవలం సంక్షేమపథకాల లబ్ధిదారులుగా కాకుండా పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదిగేందుకు ఈ కార్యక్రమాలు చేయూత ఇవ్వనున్నాయి.
ఒక్కో ఇంక్యుబేటర్కు రూ.10.70 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. రూ. 21.40 కోట్ల వ్యయంతో మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్, బ్రాండింగ్, సున్నా–వడ్డీ రుణాలు, సలహాలు అందిస్తారు. లాభదాయక వ్యాపారాలు చేస్తున్న 300 మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద 150 మంది వ్యాపారాలకు (రెండు కలిపి 300) మూడేళ్లపాటు సహకారాన్ని అందిస్తారు. 18 మంది చొప్పున (36 మందికి) గ్రాంట్, మిగిలిన వారికి సున్నాశాతం వడ్డీతో సాఫ్ట్లోన్లు ఇస్తారు.
రాష్ట్రస్థాయిలో మొదలైన ఈ ప్రోగ్రామ్ను జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు తీసుకెళ్లనున్నారు. ఫీల్డ్ కేడర్ ద్వారా ఔత్యాహిక పారిశ్రామికవేత్తల గుర్తింపు, అప్లికేషన్ సపోర్ట్, ఎస్హెచ్జీలు, విలేజీ ఆర్గనైజర్స్, మండల సమాఖ్య వేదికల ద్వారా మొబిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాస్థాయిల్లో ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్ ప్రారంభించి, 30వ తేదీ కల్లా పూర్తిచేయనున్నారు. వీటిని ‘జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ లాంచ్ ఈవెంట్’గా నిర్వహించాలని జిల్లా అధికారులను పంచాయతీరాజ్శాఖ ఆదేశించింది.
జిల్లాల వారీగా చూస్తే... టీ హబ్కు ఆదిలాబాద్, భద్రాద్రి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి... బిట్స్పిలానీ–హైదరాబాద్కు హనుమకొండ, జగిత్యాల, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలు కేటాయించారు.


