విచారణ చేస్తున్నాం..
మహబూబ్నగర్, గట్టు: మండల కేంద్రంలో పాడుబడిన ఇళ్ల గోడలను తొలగించే క్రమంలో కొందరు కూలీలకు బంగారం దొరికిందనే విషయంపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. రెండు చోట్ల గుప్త నిధులు బయట పడ్డాయని, ఇందులో లభించిన బంగారం పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తడంతో విషయం కాస్త బయటకు పొక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
గుప్త నిధులను బయటకు తీసే క్రమంలో 1992 కాలం నాటికి వెండి నాణెం ఫొటో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గుప్తనిధులకు సంబంధించి 73 వెండి నాణ్యాలు లభించగా ఇందులో 33 నాణ్యాలు, రూ. లక్ష నగదు కూలీలు ఇంటి యజమానికి అప్పగించినట్లు సమాచారం. బంగారాన్ని మాత్రం మాయం చేసినట్లు తెలిసింది. గట్టులో సుమారు 50 ఏళ్ల క్రితం నేతాజీ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున గుప్త నిధులు బయటపడగా.. కొన్నింటిని స్థానికులు స్వాహా చేయగా మిగిలిన వాటిని అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నేటి సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరచినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలను పురావస్తు శాఖ నిషేధించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు ప్రాంతం సిరి సంపదలతో బంగారు గట్టుగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర చెబుతోంది. గట్టు ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, ఊరి చుట్టూ రక్షణ గోడ, చీకటి పడితే ఊళ్లోకి బయటి వ్యక్తులను రానిచ్చేవారు కాదని శతాధిక వృద్ధులు చెబుతున్నారు. తర్వాత కాలంలో దారి దోపిడి చేసే వాళ్లకు ఆవాసంగా మారి, ఈ దారి గుండా వెళ్లే వారిని దోచుకుని, దాచుకున్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలోని ఆలయాలను కొందరు గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేస్తునే ఉన్నారు. కొన్ని ఆలయాలను గ్రామస్తులు పునరుద్ధరించగా.. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.
'గట్టులో బంగారం లభించిందన్న వ్యవహారం తన దృష్టికి వచ్చింది. ఇది వాస్తవమా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో విచారణలో జాప్యం జరుగుతోంది. ఇంటి యజమానితో పాటుగా కూలీలను విచారించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.' – శేఖర్గౌడు, ఎస్ఐ


