ఈసారి రూ.90 కోట్లు | HMDA Chief Engineer arrested in disproportionate assets case | Sakshi
Sakshi News home page

ఈసారి రూ.90 కోట్లు

Jul 15 2026 3:15 AM | Updated on Jul 15 2026 3:15 AM

HMDA Chief Engineer arrested in disproportionate assets case

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ అరెస్ట్‌ 

రవీందర్‌తోపాటు బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ దాడులు 

భారీగా ప్లాట్లు, ఫ్లాట్లు, బంగారం, నగదు గుర్తించిన అధికారులు 

బహిరంగ మార్కెట్‌లో ఆస్తుల విలువ రూ.90 కోట్లు ఉంటుందని అంచనా 

దాడులతో ఇంజనీరింగ్, ప్లానింగ్‌ విభాగాల్లో కలకలం

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో లంచగొండి అధికారిపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో (హెచ్‌ఎండీఏ) చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై కేసు నమోదు చేసింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఏసీబీ సిటీ రేంజ్‌–1 అధికారులు ఆయన బినామీలను గుర్తించడంతోపాటు కీలక సమాచారం సేకరించారు. దీని ఆధారంగా మంగళవారం హై దరాబాద్, నిజామాబాద్‌ల్లో ఏకకాలంలో తొమ్మిది ప్రాంతా ల్లో సోదాలు నిర్వహించారు. వీటిలో రవీందర్‌ ఇల్లు, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, బినామీల ఇళ్లుఉన్నాయి.  

ప్లాట్లు.. ఫ్లాట్లు.. వ్యవసాయ భూములు 
రవీందర్‌ తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంత్లాలో చేసిన సోదాల్లో కొండకల్, కిస్తాపూర్, పసుమాములలో ఐదు ప్లాట్లకు సంబంధించిన పత్రాలు లభించాయి. వీటి అధికారిక విలువ రూ.38,89,700గా ఏసీబీ నిర్ధారించింది. అలాగే నార్సింగి, నానక్‌రామ్‌గూడల్లో రూ.2,07,40,000 విలువైన నాలుగు ఫ్లాట్లు, కొత్తూరు మండలం గూడూరు గ్రామం, శంషాబాద్‌ల్లో రూ.6 లక్షల విలువైన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, రూ.1,33,58,800 విలువైన మోకిలాలోని శ్రీవారి మెడోస్‌లో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విల్లా, రూ.3 కోట్ల విలువైన కొండాపూర్‌లోని మసీదు బండ ప్రాంతంలో 300 చదరపు గజాల్లో నిర్మించిన జీ+4 భవనానికి సంబంధించిన పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. 

అలాగే, రూ.3.82 లక్షల నగదు, 1.44 కేజీల బంగారం, 12.5 కిలోల వెండి ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో రూ.17,24,000 విలువైన గృహోపకరణాలు, రూ.9.32 లక్షల విలువైన ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు, రూ.1.16 కోట్ల విలువైన నాలుగు వాహనాలు (ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ) స్వా«దీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.45,05,776 బ్యాలెన్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఈ స్థిరచరాస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.9,24,02,276 ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రకటించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.90 కోట్ల కు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు లో ఉందని, రవీందర్‌ను అరెస్టు చేశామని అధికారులు ప్రకటించారు. విచారణ అనంతరం బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. రవీందర్‌తోపాటు ఆయన కుటుంబీకులు, బినామీలకు సంబంధించిన ఇతర స్థిరచరాస్తులు గుర్తించే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.  

భారీ ప్రాజెక్టుల్లో కీలకంగా.. 
గత ప్రభుత్వ హయాంలో బీఎల్‌ఎన్‌ రెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలను నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆయన ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ తరువాత సీనియర్‌ ఇంజనీర్‌ పరంజ్యోతి కొంతకాలం చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. సీనియారిటీలో భాగంగా రవీందర్‌కు ఈ పదవి దక్కింది. అప్పటి వరకు ఆయన హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) సీజీఎంగా పనిచేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణం మొదలుకొని దాన్ని ప్రైవేట్‌ సంస్థకు లీజుకు ఇవ్వడం వరకు ఆయన హెచ్‌జీసీఎల్‌ కేంద్రంగా పనిచేశారు. 

రెండేళ్ల క్రితం చీఫ్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత సికింద్రాబాద్‌–శామీర్‌పేట్, ప్యారడైజ్‌–డెయిరీఫామ్‌ వంటి భారీ ఎలివేటెడ్‌ ప్రాజెక్టులు, నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఔటర్‌ను, ప్రధాన కాలనీలను అనుసంధానం చేసే లింకురోడ్లు, కొత్వాల్‌గూడఎకో పార్కు నిర్మాణం, రావిర్యాల నుంచి ఫ్యూచర్‌సిటీ మీదుగా ఆమన్‌గల్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు–1, అలాగే బుద్వేల్‌ నుంచి కొడంగల్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌రోడ్‌–2 వంటి ప్రాజెక్టులను చేపట్టారు. మరోవైపు బిడ్డింగ్‌ నోటిఫికేషన్‌లు మొదలుకొని బిడ్‌ల కేటాయింపు, కాంట్రాక్టర్‌ల ఎంపిక, అంచనాల రూపకల్పన, నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ఇంజనీరింగ్‌ విభాగం ఎంతో కీలకమైంది. 

కాగా, ఏసీబీ దాడులు హెచ్‌ఎండీఏలోని ఇంజనీరింగ్, ప్లానింగ్, తదితర విభాగాల్లోని అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. మంగళవారం ఉదయమే ఏసీబీ దాడుల వార్తలు తెలియడంతో ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన పలువురు అధికారులు కార్యాలయానికి కూడా రాకుండా దూరంగా ఉండిపోయారు. అదీగాక ఇటీవలి కాలంలో తరచుగా ఏసీబీ దాడులు జరుగుతుండటంతో కొందరు అధికారులు నిర్ణీత పనివేళల్లో కాకుండా ఏదో ఒక సమయంలో మాత్రమే ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement