ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతం. ప్రస్తుతం కంపెనీ ఏఐ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడంతో పాటు, ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది.
మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోతలో 'ఎక్స్బాక్స్' గేమింగ్ విభాగం ఎక్కువ ప్రభావితమైంది. ఇందులో మొదటి విడతలోనే 1,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా.. ఎక్స్బాక్స్ తనకు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించాలని, మరో స్టూడియోతో కూడా విడిపోవాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా.. జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటించింది. ఉద్యోగి కంపెనీలో ఎంతకాలం పనిచేశాడు?, ఏ స్థాయిలో ఉన్నాడు? అనే విషయాల ఆధారంగా వారికి 60 రోజుల నుంచి 39 వారాల వరకు వేతనం చెల్లించనుంది. దీంతోపాటు.. కొంతకాలం వరకు ఆరోగ్య బీమా, కంపెనీ షేర్లకు సంబంధించిన ప్రయోజనాలను కూడా కొనసాగించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి కొంత సహాయపడుతుంది.
ఎక్స్బాక్స్ అధిపతి ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన సందేశంలో ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినంత బాగా లేదని తెలిపారు. ఇతర గేమింగ్ సంస్థలతో పోలిస్తే తమ లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అయితే.. ఉద్యోగులను తొలగించడం అనేది వారి పనితీరును బట్టి తీసుకున్న నిర్ణయం కాదని, సంస్థ భవిష్యత్తు.. అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినదని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!
మైక్రోసాఫ్ట్ తీసుకున్న లేఆఫ్స్ నిర్ణయం ప్రపంచ ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏఐ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండేందుకు కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవే అయినప్పటికీ, సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


