న్యూఢిల్లీ: దేశీయంగా మే నెలలో 1.53 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. ఇది గతేడాది మే తో పోలిస్తే 9.49 శాతం, ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 11 శాతం అధికం. మే నెలలో ఇండిగో మార్కెట్ వాటా 64.9 శాతానికి తగ్గగా, ఎయిరిండియా గ్రూప్ 25.6 శాతానికి పెరిగింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పేమీ లేకుండా 5.8 శాతంగానే కొనసాగగా, స్పైస్జెట్ మాత్రం 2.5 శాతానికి క్షీణించింది.
జనవరి–మే మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 7.29 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య వార్షికంగా 1.91 శాతం, నెలవారీగా 9.49 శాతం మేర వృద్ధి చెందినట్లు వివరించింది. 10 కీలక విమానాశ్రయాల్లో సమయపాలన (ఓటీపీ) విషయానికొస్తే 82.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా గ్రూప్ వరుసగా 78.3 శాతం, 74.5 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. స్పైస్జెట్ ఓటీపీ 26.5 శాతంగా ఉంది.
మే నెలలో విమానాల రద్దుతో 63,723 మందిపై ప్రభావం పడగా, పరిహారం..ప్రయాణికులకు సదుపాయాల కల్పన కోసం ఎయిర్లైన్స్ రూ. 70.32 లక్షలు వెచ్చించాయి.


