దుబాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA), యూఏఈ తొలి పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ సంస్థ UAEV (Emarat EV Charging Stations Company) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దుబాయ్లోని మజ్లిస్లు, కమ్యూనిటీ కౌన్సిల్స్, వెడ్డింగ్ హాల్స్ వంటి ప్రజా సదుపాయాల వద్ద దశలవారీగా ఆధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో నివాసితులు, సందర్శకులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత సులభతరం కానుంది.
ఈ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అల్ రషీదియా మజ్లిస్, అల్ బర్షా మజ్లిస్, నాద్ అల్ షెబా మజ్లిస్లలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 2026లో అల్ ఖవానీజ్ మజ్లిస్, అల్ వార్కా మజ్లిస్, అల్ బర్షా వెడ్డింగ్ హాల్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. అనంతరం 2027లో అల్ త్వార్ వెడ్డింగ్ హాల్, అల్ అవిర్ మజ్లిస్, హట్టా మజ్లిస్ల వరకు ఈ నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రాజెక్టు యూఏఈ నెట్ జీరో 2050 వ్యూహం, దుబాయ్ సోషల్ అజెండా 33 లక్ష్యాలకు అనుగుణంగా అమలు కానుంది. అలాగే 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,000కిపైగా హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న యూఏఈవీ లక్ష్యానికి కూడా ఇది బలాన్నిస్తుంది. ఇటీవల మసీదుల పార్కింగ్ ప్రాంగణాల్లో కూడా ఇదే తరహా ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు యూఏఈవీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దుబాయ్లో గ్రీన్ మొబిలిటీ విస్తరణ వేగంగా సాగుతోందనే సంకేతాలను ఇస్తోంది.


