రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.

ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.


