సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎట్టపరిస్థితుల్లో భయపడేది లేదని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు (గురువారం) గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళితే టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని దానిపై పోలీసుల వద్దకు వెళితే కనీసం తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం లేదన్నారు.
టీడీపీ నేతలే తమపై దాడిచేసి తిరిగి వారే వైఎస్సార్సీపీ నాయకులపై కేసు పెట్టారన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మెుండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కానిస్టేబుల్పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని అతనిపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు.
కూటమి ప్రభుత్వంలో అరాచకం పెరిగి పోయిందని పోలీస్ స్టేషన్లలోనే హత్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు.


