సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల గల్లంతు ఘటనలో చంద్రబాబు ప్రభుత్వ ఘోర వైఫల్యం బయటపడింది. 4వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు బోటు ప్రమాదానికి గురికాగా.. రాత్రి 7 గంటల వరకు చూసిన కుటుంబ సభ్యులు.. ఆ తరువాత అధికారులకు సమాచారం ఇచ్చారు. 4వ తేదీ రాత్రి 7 గంటల తరువాత తమకు సమాచారం వచ్చిందని ఆర్డీవో తెలిపారు. అయితే, 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం వచ్చినట్టు రిపోర్టులో త్రీ మెన్ కమిటీ పేర్కొంది.
తనకు 5వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందని ఫిషరీస్ కమిషనర్ తెలిపారు. తప్పుని కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వం అడ్డంగా దొరిపోయింది. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు మండిపడుతున్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించలేదని మొదటి నుంచి బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు తాము గల్లంతు అయిన ప్రాంతానికి ఒక్క బోటు, హెలికాప్టర్ కూడా రాలేదని బోటు డ్రైవర్ చిన్నా తెలిపారు.
బాధ్యత గల ప్రభుత్వం అంటే.. ఆఖరి ఆశ ఆరిపోయే వరకూ ప్రాణాలను కాపాడేందుకు శ్రమించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బాధితుల గొంతు నొక్కేస్తూ, సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. 72 గంటలకు పైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం.. ఏమయ్యారో తెలియకుండానే వారు బతికి లేరని నిర్థారించేసింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం పేరుతో రూ.10 లక్షలు అందజేశారు.
అది కూడా.. మత్స్య శాఖ నుంచి రూ.5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించడంపైనా విమర్శలొస్తున్నాయి. 2023లో హార్బర్లో బోట్లు అగ్ని ప్రమాదానికి ఆహుతైతే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో బోటు, వలలకు రూ.20 లక్షలకు పైగా పరిహారం అందించింది. చిన్న వల కాలిపోయినా.. దానికీ పరిహారం అందించింది. కానీ.. ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి కనిపించకపోతే.. గాలించడం వదిలేసి.. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


