సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.
రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు.
అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలు
రావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.
అతని వీడియోలే అన్నీ చెబుతాయి
రావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.
జనసేనపై వ్యాఖ్యలు
చంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు
హిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.
ఆ మాటకు కట్టుబడి ఉన్నా
2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


