ఫడ్నవీస్‌ను కాదని షిండేతో భేటీ దేనికి? | Sharad Pawar Meets Eknath Shinde, Why This Surprise Meeting Is Creating Political Buzz Amid Maharashtra's Political Equations | Sakshi
Sakshi News home page

ఫడ్నవీస్‌ను కాదని షిండేతో భేటీ దేనికి?

Jul 9 2026 11:08 AM | Updated on Jul 9 2026 11:22 AM

Sharad Pawar Meets Shinde: Why Surprise Meeting Is Raising Political Buzz

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సాధారణ మర్యాదపూర్వక భేటీగానే ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఈ సమావేశం జరిగిన సమయం, కలిసిన నేతల ప్రాధాన్యం రాజకీయ చర్చలకు దారితీస్తోంది.

మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు శరద్‌ పవార్‌ బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏక్‌నాథ్‌ షిండే ఛాంబర్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వెంట ఎన్సీపీ (ఎస్పీ) నేతలు జయంత్‌ పాటిల్‌, జితేంద్ర అవ్హాద్‌, శశికాంత్‌ షిండే కూడా ఉన్నారు.

ఆ సమయంలో షిండే క్యాబినెట్‌ సమావేశంలో ఉన్నారు. పవార్‌ వచ్చిన విషయం తెలుసుకున్న షిండే సమావేశం నుంచి బయటకు వచ్చి ఆయనను కలిశారు. ఇద్దరు నేతలు దాదాపు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం షిండే తిరిగి క్యాబినెట్‌ సమావేశానికి వెళ్లగా.. పవార్‌ కొంతసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

అసలు చర్చంతా ఫడ్నవీస్‌ చుట్టూనే..
ఈ భేటీలో ఆసక్తిని పెంచిన అంశం ఒక్కటే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక నిర్ణయాధికారిగా ఉన్నప్పటికీ.. పవార్‌ ఆయనను కాకుండా షిండేను కలవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. అయితే దీన్ని కేవలం ఫడ్నవీస్‌ను పక్కన పెట్టిన చర్యగా చూడలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో షిండేకు ఉన్న ప్రత్యేక రాజకీయ స్థానం ఈ భేటీకి కారణంగా కనిపిస్తోంది.

శివసేనలో చీలిక తర్వాత షిండే వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి పలువురు నేతలు షిండే శిబిరంలోకి వెళ్లడం, ఇటీవల ఆ వర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు.. షిండేను ఒక ప్రత్యేక రాజకీయ కేంద్రంగా నిలిపాయి.

షిండే ఎందుకు కీలకం?
శరద్‌ పవార్‌కు మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ప్రత్యర్థి పార్టీల నేతలతోనూ రాజకీయ సంబంధాలు కొనసాగించడం ఆయన శైలిలో భాగం. ఈ నేపథ్యంలో షిండేతో భేటీని కూడా అదే రాజకీయ సంప్రదింపుల కోణంలో చూడాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు.. శివసేనలోని పరిణామాలు, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో నెలకొన్న అంతర్గత సమస్యల నేపథ్యంలో ఈ సమావేశం కొత్త ఊహాగానాలకు కారణమైంది.

ఎంవీఏలో పెరుగుతున్న ఒత్తిళ్లు
కాంగ్రెస్‌, ఎన్సీపీ (శరద్‌ పవార్‌ వర్గం), శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) కలిసి ఉన్న మహా వికాస్‌ అఘాడీకి ఇటీవలి కాలంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లడం ప్రతిపక్ష కూటమిలో కలకలం రేపింది. భవిష్యత్‌ రాజకీయ పోరాటాలకు ముందు కూటమి ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో పవార్‌–షిండే భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజకీయ సంకేతమా? లేక..
అయితే ఈ సమావేశంలో రాజకీయ సమీకరణాలపై చర్చ జరిగిందని ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షిండే కార్యాలయం దీనిని మర్యాదపూర్వక సమావేశంగానే పేర్కొంది. పవార్‌ కూడా భేటీ వివరాలను వెల్లడించలేదు. కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో నేతల మధ్య జరిగే ప్రతి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరద్‌ పవార్‌ వంటి సీనియర్‌ రాజకీయ నాయకుడు.. అధికార కూటమిలో కీలకంగా ఉన్న షిండేను ప్రత్యేకంగా కలవడం సహజంగానే చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: ఆపరేషన్‌ ఫడ్నవీస్‌.. షిండేకు బీజేపీ పెద్దల సాయం?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement