న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్లో సురక్షితంగా ఈవీలను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 45 శాతం ఇళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను అప్గ్రేడ్ (ఆధునీకరణ) చేయాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (ఏఈఈఈ), ఈవీ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ ‘కజామ్’ భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది నెట్–జీరో ట్రాన్సిషన్ స్టార్ట్స్ అట్ హోమ్: ఎనేబ్లింగ్ ఈవీ–రెడీ రెసిడెన్సెస్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను న్యూఢిల్లీలో విడుదల చేశారు. టైర్–1, టైర్–2, టైర్–3 నగరాల్లోని స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల సముదాయాలు, అద్దె ఇళ్లతో సహా సుమారు 80,000 పైగా నివాస ప్రాంతాల్లో ఉన్న ఈవీ ఛార్జర్ల డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు:
∙దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్లో ఈవీల వాటా 2024లో కేవలం 0.2%గా ఉండగా, 2035 నాటికి అది దాదాపు 6%కి పెరిగే అవకాశం ఉందని అంచనా.
∙ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికి మాత్రమే ఇంటి వద్ద ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
∙సరైన మౌలిక వసతులు, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చాలామంది సాధారణ విద్యుత్ సాకెట్లు, తాత్కాలిక ఎక్స్టెన్షన్ వైర్లు, ఇతర షేర్డ్ కనెక్షన్ల ద్వారా ప్రమాదకరమైన పద్ధతుల్లో ఛార్జింగ్ చేస్తున్నారు. నిరంతర ఈవీ ఛార్జింగ్ లోడ్ను భరించేలా ఇవి రూపొందించకపోవడంతో షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. ఇలాంటి పద్ధతుల వల్ల ఛార్జింగ్ విశ్వసనీయత తగ్గడంతో పాటు ఛార్జింగ్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాహన బ్యాటరీ సామర్థ్యం కూడా వేగంగా క్షీణించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లు
నివేదిక సూచనలు:
ఇళ్ల వద్ద ఈవీలను సురక్షితంగా, విశ్వసనీయంగా, సులభంగా ఛార్జ్ చేసుకునేందుకు ప్రతి ఇల్లు కనీస భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలని నివేదిక సూచించింది. నిరంతర ఛార్జింగ్ లోడ్ను తట్టుకునేందుకు తగినంత విద్యుత్ లోడ్ (సాంక్షన్డ్ లోడ్)తో పాటు ప్రత్యేక ఛార్జింగ్ సర్క్యూట్ ఉండాలని పేర్కొంది. అలాగే ప్రమాణాలకు అనుగుణమైన వైరింగ్, సరైన ఎర్తింగ్, అగి్నప్రమాద భద్రతా నిబంధనలకు అనుగుణంగా సురక్షిత ప్రదేశంలో ఛార్జర్ను ఏర్పాటు చేయాలని సూచించింది. అదనంగా తగిన సామర్థ్యం గల ఎంసీబీలు, ఎర్త్–లీకేజ్ ప్రొటెక్షన్ వ్యవస్థ, అలాగే నిరంతర ఛార్జింగ్ లోడ్ను తట్టుకునే సరి్టఫైడ్ (ధృవీకరించిన) ప్రత్యేక ఈవీ సబ్–మీటర్ను ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేసింది.
ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట!


