ఈవీ అమ్మకాల జోరు | EV sales in the state have increased threefold | Sakshi
Sakshi News home page

ఈవీ అమ్మకాల జోరు

Aug 7 2026 5:38 AM | Updated on Aug 7 2026 5:38 AM

EV sales in the state have increased threefold

పెట్రోల్‌ ధరల మోతతో రాష్ట్రంలో మూడురెట్లు పెరిగిన ఈవీ అమ్మకాలు

ఈ ఏడాది ఏడు నెలల్లో 64,167 ఈవీల విక్రయం

గతేడాది మొత్తం అమ్మకాలు 30,908 మాత్రమే..

దేశవ్యాప్త అమ్మకాలతో పోలిస్తే 12వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాక్‌ యుద్ధం మొదలైన తర్వాత ఈవీల అమ్మకాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2025లో మొత్తం 30,908 ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడు కాగా, ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనే ఆ సంఖ్య 64,167 దాటింది. దీనిని బట్టి ఏ స్థాయిలో అమ్మకాలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇశ్రాయిల్‌–ఇరాక్‌ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడంతోపాటు అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లింది. 

ఈ ఏడాది ప్రారంభంలో నెలకు 5,000పైగా ఉండే ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు ఇప్పుడు రెట్టింపైనట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తొలిసారిగా జూన్‌లో ఈవీల అమ్మకాలు 10వేల మార్కును దాటడమే కాకుండా, వరుసగా జూలై నెలలో కూడా 11,974 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈవీ అమ్మకాలు మూడు రెట్లకుపైగా పెరిగి తొలిసారి లక్ష మార్కును అధిగమిస్తాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే..
దేశవ్యాప్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఈవీల అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ చాలా వెనుకబడి ఉంది. జూలైలో ఈవీల అమ్మకాలను పరిశీలిస్తే మొత్తం విక్రయాల్లో 4 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానంలో ఉంది. దేశంలో ఈవీ అమ్మకాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు 46 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ 47,062 వాహనాల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కొరత
మన రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచడానికి ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ–2024–29ని తీసుకొచ్చినా మౌలిక వసతులు మాత్రం కల్పించలేదు. దీంతో ఈవీ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య పెరిగితే ఈవీ అమ్మకాలు మరింత పెరుగుతాయని వ్యాపారాలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో చార్జింగ్‌ చేసుకునే వారికి యూనిట్‌కు రూపాయికిపైగా సబ్సిడీ ఇస్తున్నారు. అందువల్లే ఆ రాష్ట్రంలో ఈవీల అమ్మకాలు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా సోలార్‌ విద్యుత్‌ అందుబాటులో ఉన్న సమయంలో ఈవీల చార్జింగ్‌పై రాయితీ ప్రకటించాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement