పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట! | PUC Certificate Validity May Extend to 3 Years BS6 Vehicles | Sakshi
Sakshi News home page

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Jun 25 2026 1:50 PM | Updated on Jun 25 2026 2:04 PM

PUC Certificate Validity May Extend to 3 Years BS6 Vehicles

బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొత్త వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC)సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఎస్-6 వాహనాలకు నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి పీయూసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించే అవకాశం ఉంది.

ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్న బీఎస్-6 వాహనాలు ప్రతి ఏడాది పీయూసీ సర్టిఫికెట్‌ని రెన్యువల్ చేయించుకోవాలి. పదేళ్లు దాటిన వాహనాలకు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి కావచ్చు. వాణిజ్య బీఎస్-6 వాహనాలకు ఆరు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల చెల్లుబాటు ఇవ్వాలని, ఆ తర్వాత వార్షిక పునరుద్ధరణ విధానాన్ని కొనసాగించాలని అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ మార్పులు ‘PUCC 3.0’ పేరుతో రూపుదిద్దుకుంటున్న సంస్కరణలలో భాగమని తెలుస్తోంది. బీఎస్-6 వాహనాలు పాత తరహా బీఎస్-4, బీఎస్-3 వాహనాలతో పోలిస్తే నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ ధూళికణాల ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో తక్కువ కాలుష్యం విడుదల చేసే వాహన యజమానులపై అనవసర పరిపాలనా భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు.

అయితే పాత వాహనాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశమూ ఉంది. ముఖ్యంగా అధిక కాలుష్యం వెదజల్లే వాహనాలకు తరచూ పరీక్షలు నిర్వహించడం, పీయూసీ కేంద్రాల్లో తప్పుడు రీడింగులు లేదా డేటా తారుమారును అరికట్టేందుకు పరీక్షా విధానాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఇదే సమయంలో దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించేందుకు స్క్రాపేజ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. అయితే పీయూసీ చెల్లుబాటు కాలం పెంపుపై ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదు. సంబంధిత ప్రతిపాదనకు తుది ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement