వీసా ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు
పెరగనున్న స్క్రూటినీ
స్టూడెంట్ ఓపీటీ ప్రోగ్రామ్లోనూ మార్పులు
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం.
ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే కానీ.. ఓకే అయితే మాత్రం అమెరికన్ వీసా కావాలంటే కొండలు కరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఖర్చుతోపాటు విపరీతమైన స్క్రూటినీ, దస్తావేజులు అవసరమవుతాయని, భారతీయ ఐటీ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వివరాలు...
‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’స్లోగన్తో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలస దారులను తరిమేస్తామని తరచూ హూంకరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) విభాగం అక్రమ వలసదారుల ఏరివేతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూడా. అంతేకాకుండా... ఇతర దేశస్తులు అమెరికాలో పని చేయడంపై కూడా ఆయన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తొలిసారి గద్దెనెక్కినప్పుడు కూడా అమెరికన్ ఉత్పత్తులే కొనాలని, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ప్రతిపాదించిన ఆయన విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1–బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేయాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తోపాటు ఐస్ కూడా వీసాల జారీ, అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ఎన్నో మార్పులు చేశారు కూడా.
తాజాగా హెచ్1–బీ వీసాల జారీ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం డీహెచ్ఎస్, కార్మీక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ప్రచురితమైంది. ప్రజాభిప్రాయ సేకరణ (టెక్ కంపెనీలు, యూనివర్శిటీలు, వలస కార్మీకుల హక్కుల పరిరక్షణ సంఘాలు) తరువాత అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తరువాత అమల్లోకి వస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రతిపాదనలు వచ్చే నెల నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది.
ఓపీటీపైనా ఫోకస్
అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమంలోనూ పలు మార్పులను ప్రతిపాదించారు. 2024 –25లో భారత్ నుంచి సుమారు 3.6 లక్షల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లగా ప్రస్తుతం వారు కోర్సుకు తగ్గట్టుగా ఎంతకాలమైనా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మాత్రం ఇలా కుదరదు.
నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత పొడింపునకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటే వచ్చే ఏడాది ఫ్రిబరి నుంచి ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబంధనలను సమీక్షించనున్నారు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసన్ రంగాల్లో చదివేవారికి ఇచ్చే రెండేళ్ల పొడిగింపుపై ఫోకస్ పెట్టారు.
.వీటితోపాటే కొంతమంది విదేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) విషయంలోనూ మార్పులు రానున్నాయి. తుది నిబంధనలు ఈ నెలలోనే రానున్నాయి. ఫలితంగా ఈఏడీల ఆటోమెటిక్ పొడిగింపునకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్1–బీ వీసాదారుల భార్య/భర్తలే ఎక్కువగా ఈ ఈఏడీల ఆధారంగా ఉద్యోగాలు చేస్తూంటారు. ఈఏడీల పొడిగింపు ఆలస్యమైతే వారు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోతుంది.
ఇవీ మార్పులు
ముందుగా వీసా నిబంధనల్లో రాగల మార్పులు చూద్దాం. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు.
యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు.
అమెరికన్లు చేయలేని పని హెచ1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. ఇంకోలా చెప్పాలంటే కంపెనీలు హెచ్1–బీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలు పెరుగుతాయి. వీసాల పొడిగింపునకూ ఫీజులు వసూలు చేయాని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. పెర్మ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను కూడా మార్చనున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


