భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం! | US Launches Fresh Strikes on Iran as Trump Declares Peace Accord Over | Sakshi
Sakshi News home page

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:41 AM

US Launches Fresh Strikes on Iran as Trump Declares Peace Accord Over

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్‌, బందర్‌ అబ్బాస్‌, కొనారక్‌, ఇరాన్‌షహర్‌ సహా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది.

అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్‌ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్‌ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది.

హెచ్చరిక తర్వాతే దాడులు
మంగళవారం హర్ముజ్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్‌ చేపట్టినట్లు ట్రంప్‌ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.

టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.

మరింత తీవ్రంగా అమెరికా దాడులు
రాయిటర్స్‌ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్‌ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్‌ అబ్బాస్‌, నౌకాదళ స్థావరాలు ఉన్న కొనారక్, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్‌లో సముద్ర రవాణా నియంత్రణ టవర్‌కు నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్ల అనంతరం అక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్‌షహర్‌లో కూడా వరుస పేలుళ్లు నమోదయ్యాయి.

అమెరికా స్థావరాలే లక్ష్యంగా..
అమెరికా దాడులకు ముందు ఇరాన్‌ కూడా ప్రతిస్పందించింది. బహ్రెయిన్‌, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై "భారీ దాడి"కి సిద్ధమవుతున్నామని ఇరాన్‌ భద్రతా వర్గాలకు చెందిన నూర్‌ న్యూస్‌ వెల్లడించింది.

హర్ముజ్‌ జలసంధే అసలు కేంద్రబిందువు
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్‌ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్‌కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్‌ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్‌లో ఇరాన్‌ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

శాంతి చర్చలకు మరోసారి దెబ్బ
జూన్‌ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చమురు మార్కెట్లలో కలకలం
తాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్‌ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement