సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే దేశ రాజధానిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్తో పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ కారణంగా సాధారణ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నీట్ NEET పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ వైపు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ మార్చ్కు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పార్లమెంట్ వైపు ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించబోమని పేర్కొంటూ నిరసనకారులను అడ్డుకున్నారు.
జంతర్మంతర్లో లాఠీచార్జ్.. ఉద్రిక్తత
జంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఐదుగురు.. అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం నిషేధమని వెల్లడించారు.
And it has finally begun.
Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026
పార్లమెంట్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్
సీజేపీ నిరసన, భారీ భద్రతా ఏర్పాట్ల కారణంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది సైతం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.
పని చేయని ఫోన్లు?
ఇదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో కొంతసేపు మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వినిపించాయి. దీంతో కొందరు ఎంపీలు, ఇతరులు కమ్యూనికేషన్ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. అయితే మొబైల్ సేవల అంతరాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మెట్రో స్టేషన్లు మూసివేత.. కట్టుదిట్టమైన భద్రత
నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్, జంతర్మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా కారణాలతో రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.
నిరసన వెనుక కారణాలివే
నీట్ సహా పోటీ పరీక్షల్లో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలన్న లక్ష్యంతో ఉద్యమం చేపట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనం వాంగ్చుక్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే సీజేపీ ఈ ర్యాలీని చేపట్టింది.
ఇటీవల వ్యంగ్య డిజిటల్ ఉద్యమంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ సంస్థ చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ పార్లమెంట్ సమావేశాల వేళ రాజకీయంగా వేడి పెంచింది.


