వార్ధా: మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నుంచి నాగ్పూర్ వైపు వెళ్తున్న మార్గంలో ఇథనాల్తో వెళ్తున్న కంటైనర్ ట్రక్కు బోల్తా పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ఆ మార్గంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్కు.. ముందున్న కారును బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదం విరుల్ గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి.


