రెండు రోజుల కిందట అదృశ్యమైన పశ్చిమ బెంగాల్కు చెందిన జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ (15) సురక్షితంగా ఇంటికి చేరింది. శనివారం ఉదయం హౌరా పోలీసులు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు.
హౌరాలోని రామ్కృష్ణపూర్ ఫెర్రీ జెట్టీ సమీపంలో ఒంటరిగా తిరుగుతుండగా గమనించిన మార్నింగ్ వాకర్స్ వెంటనే దమయంతి తండ్రి ధ్రువజ్యోతి సేన్కు సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని, పోలీసుల సహకారంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు.
గురువారం ఇంటి నుంచి ఒక పని కోసం వెళ్లిన దమయంతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు చేపట్టిన దర్యాప్తులో దమయంతి హౌరా రైల్వే స్టేషన్లోని 4, 5 ప్లాట్ఫారమ్ల వద్ద సంచరించినట్లు తెలిసింది. దమయంతి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, క్రీడా వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
కారణాలు ఏంటి..?
అయితే దమయంతి అదృశ్యానికి గల అసలు కారణాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదువుల ఒత్తిడి, షూటింగ్ శిక్షణకు సంబంధించిన ఒత్తిడి వంటి అంశాలను కూడా విచారణలో పరిశీలిస్తున్నారు. దీనిపై పోలీసులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు.


