కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రోజుకో షాక్ తగులుతోంది. ఎమ్మెల్యే మదన్ మిత్ర కూడా బుధవారం రెబల్స్ క్యాంప్లో చేరారు. దీనిపై స్పందించిన మమతా బెనర్జీ... "వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు" అని ఫేస్బుక్ లైవ్లో చెప్పారు. తనకు గుండెపోటు రావాలని బీజేపీ కోరుకుందని ఆమె ఆరోపించారు. "నాకు గుండెపోటు రావాలని బీజేపీ కోరుకుంది. మీ అంతం చూసేంత వరకు నేను బతుకుతాను" అని మమత అన్నారు.
మదన్ మిత్ర బుధవారం మమతా శిబిరాన్ని వీడి రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్ వర్గంలో చేరారు. ఆ సమయంలో "నేను అసెంబ్లీలో నా గదిని మాత్రమే మార్చుకున్నాను" అని ఆయన చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ 6 నెలలు తప్పుకోవాలని తాను చేసిన డిమాండ్ను అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ను వీడినట్టు తెలిపారు.
అభిషేక్కు మద్దతుగా మమత
మదన్ మిత్ర నిష్క్రమణపై స్పందించిన మమతా బెనర్జీ.. ఆయన భార్యతో పాటు ఇద్దరు కుమారులకు మంగళవారం ఈడీ సమన్లు పంపినందువల్లే ఆయన పార్టీని వీడారని చెప్పారు. ఈ నిర్ణయంతో అభిషేక్ బెనర్జీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అభిషేక్ బెనర్జీని పార్టీపై దాడి చేయడానికి ఒక సాకుగా మార్చారని మమత అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పలుసార్లు సమన్లు వెళ్లాయని చెప్పారు. రాజీ పడితే ఆయనకు ఉపశమనం దొరికేదని, అయినా ఆయన పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదని కొనియాడారు మమతా బెనర్జీ.


