- టీఎంసీ ఖజానాకు తాళం!
- ఖాతాలపై మరో కొరడా
- మొన్ననే రూ.440 కోట్లు
- ఇప్పుడు రూ.1,000 కోట్లు ఫ్రీజ్
కోల్కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో 12 బ్యాంకు ఖాతాలను పశ్చిమ బెంగాల్ పోలీసులు స్తంభింపజేశారు. అంతకుముందు రోజు పార్టీకి చెందిన 3 ఖాతాలను పరిమితంగా నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఆ 3 ఖాతాల్లో సుమారు రూ.440 కోట్ల నిధులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
సీనియర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తాజాగా స్తంభింపజేసిన 12 ఖాతాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 15 టీఎంసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. వాటిలో సుమారు రూ.1,000 కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఖాతాల యజమానుల వివరాలు, నమోదైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరినట్టు సమాచారం.
ఈ చర్యకు ఒక రోజు ముందు కోల్కతా హైకోర్టు టీఎంసీకి చెందిన 3 హెచ్డీఎఫ్సీ ఖాతాలను పరిమితంగా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు రిటైర్డ్ న్యాయమూర్తి సుబ్రత తాలూక్దార్ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
తాత్కాలిక ఉత్తర్వుల ప్రకారం, ప్రత్యేక అధికారి ప్రతి చెక్కుపై ప్రతిసారి సంతకం చేసిన తర్వాత మాత్రమే టీఎంసీ ఆ నిధులను రోజువారీ పరిపాలనా ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, న్యాయపరమైన ఖర్చుల కోసం వినియోగించవచ్చు. ప్రత్యేక అధికారికి పార్టీ నిధుల నుంచి నెలకు రూ.1.25 లక్షల పారితోషికం చెల్లిస్తారు.
పోలీసులు పార్టీకి చెందిన 3 ఖాతాలను స్తంభింపజేయడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ మమతా బెనర్జీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తిరుగుబాటు చేసిన టీఎంసీ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకును కోరారు.
నిధుల మూలంపై దర్యాప్తు చేపట్టాలని బిధాన్నగర్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈడీ చర్యను సవాల్ చేసిన టీఎంసీ
పోలీసుల చర్యతో పాటు, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కూడా అదే 3 ఖాతాలను స్తంభింపజేయడంతో టీఎంసీ ఇప్పటికీ ఆ రూ.440 కోట్ల నిధులను వినియోగించలేకపోతోంది. ఈడీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీఎంసీ శుక్రవారం కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది.
సీనియర్ న్యాయవాది కిశోర్ దత్తా అత్యవసర విచారణ కోరుతూ న్యాయమూర్తి కృష్ణారావు ఎదుట వాదనలు వినిపించారు. న్యాయమూర్తి సౌగత భట్టాచార్య ఉత్తర్వులు పోలీసుల చర్యలకు సంబంధించిన కేసుపై ఉన్నాయని, తాజా పిటిషన్ పీఎంఎల్ఏ కింద ఈడీ తీసుకున్న చర్యను సవాల్ చేస్తోందని తెలిపారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.
ప్రైవేటు విమానయాన సంస్థకు సంబంధించిన సుమారు రూ.160 కోట్ల మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎంబ్రాయర్ బిజినెస్ జెట్, అగస్టా హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ఈడీ అదే 3 ఖాతాలను స్తంభింపజేసింది.


