సాక్షి, తాడేపల్లి: వేదిక ఏదైనా చంద్రబాబు, లోకేష్, కూటమి నేతల ధోరణి మారడం లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో పేట్రేగిపోతున్నారని.. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా వస్తున్న జనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ తిడుతున్నారు. వ్యక్తిగత దూషణలు మా విధానం కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తానే కట్టానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటన్నాడు. ప్రాజెక్టులు కట్టడం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకానికి తప్ప చంద్రబాబు ఖర్చు చేసిందేమీ లేదు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్.
..వైఎస్ జగన్ సీఎం అయ్యాక వెలిగొండ టన్నెల్స్ ప్రారంభమయ్యాయి. నీ హయాంలో వెలిగొండకు ఎంత ఖర్చు చేశావో లెక్కలు చెప్పగలవా?. పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వించింది వైఎస్సార్. పోలవరం కుడి, ఎడమలకు పేర్లు పెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. నాగార్జున సాగర్ నీరు రావడానికి కారణం బ్రహ్మనందరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా వస్తా మీరు రాగలరా?. నిధులు ఎంత ఖర్చు పెట్టావని అడిగితే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నాడు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు.
‘‘పోలవరం ప్రాజెక్టు అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నేనే పూర్తిచేశానని చెప్పుకుంటున్నాడు. వివేకా హత్య వైఎస్ జగన్ చేయించారని చెప్పడానికి లోకేష్కు కొంచెమైనా విజ్ఞత ఉందా? వివేకా హత్య జరిగింది మీ హయాంలో కేసు దర్యాప్తును సాగకుండా అడ్డుకున్నది మీరుకాదా?. నిందితుల తరపున న్యాయవాదులు మీవారేనా కాదా?. వాస్తవాలపై చర్చ జరగకుండా బూతులు తిడుతున్నారు. తిట్టడం కాదు ఎవరు చర్చకు వస్తారో రండి. మీరు ఇలాగే రోజూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పోతే మిమ్మల్ని ప్రజలు తరిమికొడతారు’’ అంటూ గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు.


