సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వంలో కుదేలైన ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలారు. ఫీడ్ రేట్లు, పెట్టుబడి వ్యయం పెరగడంతో విలవిలాడుతున్న ఆక్వా రైతన్నలకు భరోసా కల్పించేందుకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు. చంద్రబాబు నిర్వాకంతో నైరాశ్యంలో మునిగిపోయిన ఆక్వారైతుల కష్టాలను స్వయంగా వినేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు భీమవరానికి విచ్చేశారు జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు చేసిన మేలును ఈ సందర్భంగా ఆక్వారైతులు గుర్తు చేసుకుంటున్నారు.
రైతన్నలకు పూర్తి అండదడలు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకు పూర్తి అండదడలు అందించారు. చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు నిర్ణయాలు అమలు చేశారు. విద్యుత్, రొయ్యల మేతకు సబ్సిడీ ఇచ్చి మేలు చేశారు. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే యూనిట్ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. దీంతో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ మేలు జరిగింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్లకు సబ్సిడీ విద్యుత్ను సరఫరా చేశారు. 84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు.
15 రోజులకు ఒకసారి ధరల సమీక్ష
పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్ట్లను తెచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ కృషి చేశారు.
కూటమి ప్రభుత్వం వెన్నుపోటు
ఆక్వా రైతులకు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కాలరాసింది. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ అందిస్తామన్న హామీని అటకెక్కించింది. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లకు ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తోంది. మరోవైపు రొయ్యల మేత ధరలను అదుపు చేయంలోనూ విఫలమైంది. ఫలితంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమను ఆదుకోవాలను ఎన్నిసార్లు ఆక్వారైతులు వేడుకున్నా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. దీంతో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు.


