ముద్రగడ మృతిపైనా ట్రోల్స్‌.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం! | Mudragadas Demise Sparks Row Over TDP Jana Sena Social Media Posts | Sakshi
Sakshi News home page

ముద్రగడ మృతిపైనా ట్రోల్స్‌.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!

Jul 15 2026 9:06 AM | Updated on Jul 15 2026 9:16 AM

Mudragadas Demise Sparks Row Over TDP Jana Sena Social Media Posts

సాక్షి, విజయవాడ: రాజకీయ విభేదాలు సహజమే.. కానీ మరణించిన నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని కించపరిచేలా టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన.. రెండు ప్రభుత్వాల్లో మంత్రిగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలుగా నిలిచాయి.

తన రాజకీయ జీవితంలో పలు సందర్భాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు చేపట్టారు. అరెస్టులు, నిరసనలు, దీక్షలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ఆయన రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలపై చర్చ కొనసాగుతోంది.

అయితే.. ఆయన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పార్టీలతో ఉన్న అనుబంధంపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరడం, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ రాజకీయ వైఖరిని విమర్శించడం వేరు.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం వేరు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హద్దులు దాటేసి..
ముద్రగడ పద్మనాభం జీవించి ఉన్న సమయంలోనే కాకుండా.. మరణం తర్వాత కూడా సోషల్‌ మీడియాలో ఆయనపై దుష్ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన అనుబంధ పేజీల పోస్టులు, వ్యాఖ్యలపై అభిమానులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తిపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రాజకీయాలకు అతీతంగా గౌరవం అవసరం
ఒక నాయకుడి విధానాలను, నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు, పోరాటాలను పూర్తిగా విస్మరించి.. కేవలం రాజకీయ అనుబంధాల ఆధారంగా అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.

ముద్రగడ పద్మనాభం జీవితంలో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ప్రభుత్వాలను ఎదురించి ఉద్యమాలు చేశారు. తన నమ్మిన అంశాల కోసం పోరాడారు. ఆయనతో విభేదించిన వారూ ఉన్నారు.. ఆయనను సమర్థించిన వారూ ఉన్నారు. అయితే ప్రజా జీవితంలో ఉన్న ఒక నేత మరణించిన సమయంలో కనీస గౌరవం పాటించాలనే చర్చ.. తాజాగా సోషల్‌ మీడియా పోస్టుల నేపథ్యంలో మరోసారి మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement