కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్తత | Mudragada Final Journey Turns Tense in Kirlampudi as Kranti Faces Protests | Sakshi
Sakshi News home page

కిర్లంపూడిలో ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్తత

Jul 15 2026 8:33 AM | Updated on Jul 15 2026 8:36 AM

Mudragada Final Journey Turns Tense in Kirlampudi as Kranti Faces Protests

సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడిలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బార్లపూడి క్రాంతిని కొంతమంది అభిమానులు, అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘‘గో బ్యాక్‌ క్రాంతి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దీంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు.

ముద్రగడ భౌతికకాయం స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో చివరి చూపు చూసేందుకు క్రాంతి అక్కడికి చేరుకున్నారు. అయితే తొలుత ప్రతిపాడు వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులు వద్దన్నారని పోలీసులు ఆమెకు వివరించారు.

అయితే తన తండ్రిని చివరిసారిగా చూసేందుకు అనుమతించాలని క్రాంతి పోలీసులను కోరడంతో.. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు ఆమెను కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైతం పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. నివాళులర్పించిన వెంటనే తిరిగి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కూడా ఉద్రిక్తత కొనసాగింది. 

ముద్రగడ అనుచరులు కొందరు గో బ్యాక్‌ క్రాంతి నినాదాలతో అడ్డుకున్నారు. భౌతికకాయం ఉన్న పెట్టెను కూడా తాకేందుకు ఆమెను అనుమతించలేదని సమాచారం. ఆమెను బయటకు పంపించాలని ముద్రగడ భార్య, కొందరు బంధువులు కోరారు. ఆ సమయంలో తండ్రిని చూడలేక క్రాంతి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె బిగ్గరగా రోదించడంతో సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. తన అభిష్టానికి వ్యతిరేకంగా బార్లపూడి క్రాంతి జనసేనలో చేరారు. అంతేకాదు ఆయనపై పలు విమర్శలు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో.. తాను చనిపోతే క్రాంతిని దగ్గరకు రానివ్వొద్దని ముద్రగడ స్వయంగా చెప్పారు కూడా. తాజాగా ఆయన మరణం అనంతరం కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement