మంగళగిరి, రాయదుర్గంలో అర ఎకరం చొప్పున కేటాయింపు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు కేటాయించే పని నిరంతరాయంగా కొనసాగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరితోపాటు అనంతపురం జిల్లా రాయదుర్గంలో అర ఎకరం చొప్పున టీడీపీకి ప్రభుత్వ భూములు కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవారం వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో సర్వే నంబర్ 791/4లో ఉన్న అర ఎకరం భూమిని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో సర్వే నంబర్ 280లోని అర ఎకరం భూమిని రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు. ఈ భూములను ఏడాదికి రూ.1,000 లీజుతో 66 సంవత్సరాలపాటు కేటాయింపులు చేశారు. లీజును 99 ఏళ్ల వరకు పొడిగించేందుకు అవకాశం కల్పించారు. ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా ఈ కేటాయింపు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అమరావతి ప్లాట్ యజమానులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే రెక్టిఫికేషన్ డీడ్లు
అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకంలో భూములు ఇచ్చినవారికి ప్లాట్ కోడ్లు, సరిహద్దుల్లో వచ్చిన మార్పులను సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్లాట్ కోడ్లు, సరిహద్దుల సవరణ కోసం చేసుకునే రెక్టిఫికేషన్ డీడ్లపై స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామంలో శ్రీ సప్తగిరి ఇండ్రస్టియల్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు గతంలో కేటాయించిన 7.75 ఎకరాల భూమి వినియోగంలో మార్పునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కెమికల్ సాల్వెంట్ పరిశ్రమ స్థానంలో వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల నిల్వ కోసం వేర్హౌస్ గోదాములు నిర్మించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందుకోసం రూ.54.25 లక్షల డిఫరెన్షియల్ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని షరతు విధించింది.


