తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ అధికారిపై మహిళ ఉద్యోగి చేసిన ఫిర్యాదుకు సంబంధించి డీఎంహెచ్ఓ ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిని్రస్టేషన్ అధికారి తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు కుయుక్తులు పన్నారు. విచారణ కమిటీని తనకు అనుకూలంగా మార్చుకోవడంతోపాటు అధికారికి అండగా తెలుగునాడు వైద్య ఆరోగ్య సంఘం కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ అధికారికి అనుకూలంగా విచారణ నివేదిక సమర్పించేందుకు వారు శతవిధాల ప్రయత్నించినట్లు సమాచారం. ఆ సంఘంలోని కొందరు నాయకులు ప్రశ్నించినా వారిని బెదిరిస్తూ.. కామ పిశాచికి అనుకూలంగా కృషి చేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
లంచగొండు కూడా!
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్అధికారిగా పనిచేస్తున్న కామపిశాచి ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి లంచాలకు పాల్పడడం అలవాటుగా మారింది. లంచం ముట్టితేగానీ ఆయన టేబుల్ నుంచి ఫైల్ కదలదు. అటువంటి వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయడం ఎమిటని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగు నాడు వైద్య ఆరోగ్య సంఘం నాయకులు కొందరు కార్యాలయంలో డిప్యూటేషన్ల పేరుతో తిష్టవేసి చక్రం తిప్పుతుండడం గమనార్హం. అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


