సాక్షి, నెల్లూరు: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులతో చనిపోయిన ఏడుకొండలు మృతికి నిరసనగా మాజీ మంత్రి కాకాణి ఆందోళన చేపట్టారు. అయితే, మనుబోలు ఎస్ఐ హనీఫ్ టార్చర్తోనే ఏడుకొండలు చనిపోయాడని అతడి భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి ఆసుప్రతి వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అనే అనుమానాలు ఉన్నాయి. దొంగతనం కేసులో విచారణకు పిలిచి ఎస్ఐ హనీఫ్.. ఏడుకొండలను కొట్టి చంపేశాడు. చావు బ్రతుకుల్లో ఉన్న ఏడుకొండలు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఐదు రోజులపాటు విచారణ పేరుతో స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురి చేశారు. పోస్టుమార్టం వీడియో రికార్డింగ్, పారదర్శకమైన విచారణ జరపాలి. ఏడుకొండల కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక ఏడుకొండలు మృతదేహంతో మనుబోలు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం’ అని చెప్పుకొచ్చారు.


