ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.
ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.
మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు.
ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది.
అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.
నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట.
దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.
ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.


